నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో ప్రస్తుతం కొన్ని ప్రాంతాలలో రోడ్డు విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామంలోని ఇంటి ప్రహరీని అధికారులు కూల్చివేశారు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డి పల్లెలో రూ. 8 కోట్లతో 4 కిలోమీటర్ల రహదారి విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో రోడ్డుకు అడ్డంగా ఉన్న రేవంత్ రెడ్డి ఇంటి ప్రహరీని అధికారులు కూల్చివేశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరో 43 మంది ఇళ్లను పడగొట్టారు.
ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద మరమ్మతులు చేపడుతున్నారు. ఇల్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించనుంది. ఈ విషయం పైన త్వరలోనే క్లారిటీ రానుంది. కాగా, తెలంగాణలో ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో రోడ్డు విస్తరణ కార్యక్రమాలను చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాల అభివృద్ధి పనులను చేపడుతున్నామని ఇంకా ముందు ముందు అనేక రకాల పథకాలను అమలులోకి తీసుకువచ్చి తెలంగాణను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.