నవతెలంగాణ-హైదరాబాద్: ఇజ్రాయిల్ ఆర్థికమంత్రి బెజలెల్ స్మోట్రిచ్ భారత్లో పర్యటించడాన్ని సిపిఎం పొలిట్బ్యూరో తీవ్రంగా ఖండించింది. భారత ప్రభుత్వంతో ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందంపై సంతంకం చేయడానికి ఆయన ఇజ్రాయిల్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. స్మోట్రిచ్ భారత్ పర్యటనను ఖండిస్తూ మంగళవారం పొలిట్బ్యూరో విడుదల చేసిన ప్రకటన వివరాలిలా ఉన్నాయి.
”పచ్చి మితవాద జాత్యాహంకార పార్టీకి చెందిన స్మోట్రిచ్, పాలస్తీనా ప్రజలను బలవంతంగా నిరాశ్రయులను చేయడం ద్వారా గాజాస్ట్రిప్ను ఆక్రమించాలనుకుంటున్న నెతన్యాహూ ప్రభుత్వంలో ప్రముఖ న్యాయవాది. ఆక్రమిత వెస్ట్బ్యాంక్ను ఇజ్రాయిల్లో విలీనం చేయాలనే ప్రతిపాదనకు ఆయన ప్రధానకర్త. పాలస్తీనియన్ల జాతిని ప్రక్షాళన చేయాలన్న సామాజ్య్రవాదాన్ని వ్యతిరేకిస్తూ పలు దేశాలు స్మోట్రిచ్ పర్యటనపై నిషేధం విధించాయి. మరికొన్ని దేశాలు పలు ఆంక్షలు విధించాయి. ఆదేశాల్లో బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, నార్వే, నెదర్లాండ్స్ స్లొవేనియా మరియు న్యూజిలాండ్లు ఉన్నాయి. గాజా ప్రజలు ప్రతి రోజూ ఊచకోతకు గురవుతున్న సమయంలో మోడీ ప్రభుత్వం స్మోట్రిచ్కు ఆతిథ్యమివ్వడం, ఇజ్రాయిల్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడం సిగ్గు చేటు. ఈ ఒప్పందంతో మోడీ ప్రభుత్వం నెతన్యాహూ ప్రభుత్వంతో కుదుర్చుకున్న లోతైన, దృఢమైన సంబంధాలను, గాజాలో కొనసాగుతున్న మారణహోమంలో వారి భాగస్వామ్యాన్ని హైలెట్ చేస్తుంది.
ఇజ్రాయిల్ వెంటనే కాల్పుల విరమణకు అంగీకరించి, పాలస్తీనా సమస్యకు న్యాయమైన మరియు శాంతియుత పరిష్కాం దిశగా కృషి చేసే వరకు భారత ప్రభుత్వం ఇజ్రాయిల్ ప్రభుత్వంతో అన్ని సైనిక, భద్రతా మరియు ఆర్థిక సహకారాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం” అని పొలిట్బ్యూరో పేర్కొంది.