పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి
పొన్నం ప్రభాకర్, ఎమ్డీ సజ్జనార్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సామాజిక బాధ్యతలో భాగంగా టీజీఎస్ఆర్టీసీ ‘యాత్రాదానం’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో టీజీఎస్ఆర్టీసీ ఎమ్డీ వీసీ సజ్జనార్, ఈడీలు మునిశేఖర్, రాజశేఖర్, ఖుష్రోషా ఖాన్, వెంకన్న, ఫైనాన్స్ అడ్వైజర్ విజయ పుష్ప, హెచ్ఓడీలు శ్రీధర్, శ్రీదేవి, ఉషాదేవి, ప్రభులత, కవిత తదితరులతో కలిసి మంత్రి యాత్రాదానం కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అనాథలు, నిరాశ్రయులైన వృద్ధులు, వికలాంగులు, నిరుపేద విద్యార్థుల పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పండుగలు, ఇతర శుభకార్యాలు…తదితర ప్రత్యేక సందర్భాల్లో వారిని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు, పర్యాటక ప్రాంతాలకు, విహారయాత్రలకు తీసుకెళ్లడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. దాతలు ఆ మొత్తాన్ని సంస్థకు విరాళంగా అందజేయడం ద్వారా వారికి టీజీఎస్ఆర్టీసీ బస్సు సదుపాయం కల్పిస్తున్నదని చెప్పారు.
ప్రజా ప్రతినిధులు, కార్పొరేట్ సంస్థలు, ఎన్ఆర్ఐలు, అసోసియేషన్స్, ఎన్జీవోలు స్పాన్సర్ చేయాలని కోరారు. ఈ యాత్రాదాన కార్యక్రమాన్ని వ్యక్తులు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కూడా వినియోగించుకోవచ్చనని తెలిపారు. దాతలు చెల్లించే విరాళాల మేరకు కిలోమీటర్ల ఆధారంగా ఏసీ, సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్ప్రెస్ బస్సులను ఏర్పాటు చేస్తామన్నారు. టూర్ ప్రారంభానికి వారం రోజుల ముందు బస్సులను బుకింగ్ చేసుకోవాలని కోరారు. స్థానిక ఆర్టీసీ డిపో అధికారులను సంప్రదించి యాత్రాదానం కింద బస్సులను బుకింగ్ చేసుకోవచ్చు అన్నారు. ఆర్టీసీ హెల్ప్ లైన్ నంబర్లు 040 69440000 / 040 23450033 కాల్ చేసి సమాచారం ఇస్తే సంబధిత ఆర్టీసీ అధికారులు ఫోన్ చేసి యాత్రాదాన టూర్ ప్యాకేజీల వివరాలను తెలియజేస్తారు.