నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు, కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్ (31) హత్యకు గురయ్యారు. ఉటా వ్యాలీ యూనివర్సిటీలో జరుగుతున్న కార్యక్రమంలో మాట్లాడుతుండగా ఓ దుండగుడు తుపాకీతో కాల్పులకు దిగాడు. దీంతో తీవ్రగాయాలైన చార్లీ కిర్క్ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. అమెరికాలో మాస్ షూటింగ్స్పై వర్సిటీలో చర్చా కార్యక్రమానికి చార్లీ కిర్క్ హాజరయ్యారు. ఓ టెంట్లో అతడు కూర్చొని ఓ విద్యార్థి ప్రశ్నకు బదులిస్తున్న సమయంలో దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో వెంటనే పోలీసులు కిర్క్ను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు అధ్యక్షుడు ట్రంప్ ధ్రువీకరించారు. ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. నిందితుడు కిర్క్ మెడ భాగంలో కాల్చినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో వెంటనే కిర్క్ కుప్పకూలిపోయాడు. ఈఘటనతో అక్కడికి వచ్చిన వారు ఒక్కసారిగా భయాందోళనతో పరుగులు తీశారు.
తన సన్నిహితుడు మృతి చెందడం పట్ల అధ్యక్షుడు ట్రంప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చార్లీ కిర్క్ గొప్ప వ్యక్తి అని ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్లో వెల్లడించారు. కిర్క్ మృతికి సంతాపంగా జాతీయ జెండాను అవనతం చేయాలని పిలుపునిచ్చారు. అమెరికాలో యువత హృదయాన్ని చార్లీ కంటే బాగా అర్థం ఎవరూ చేసుకోలేరని ట్రంప్ పేర్కొన్నారు.