పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత వీరిద్దరి కలయికలో వస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. తాజాగా చిత్ర బృందం భారీ షెడ్యూల్ను విజయవంతంగా ముగించింది. దీంతో పవన్ కళ్యాణ్ తన భాగం చిత్రీకరణను పూర్తి చేశారు. ఈ కీలకమైన షెడ్యూల్ను పూర్తి చేయడానికి నటీనటులు, సిబ్బందితో కలిసి దర్శకుడు హరీష్ శంకర్ అహర్నిశలు శ్రమించారు. టాకీ పార్ట్లో ఎక్కువ భాగం పూర్తి కావడం, చిత్రీకరణ సజావుగా సాగడం పట్ల నిర్మాతలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్న తరుణంలో చిత్ర బృందం త్వరలోనే నిర్మాణాంతర కార్యక్రమాలను మొదలు పెట్టనుంది.