రాజకీయాల కోసం భారత్పై వ్యతిరేక భావజాలం : మోడీ
దరంగ్ : దేశ వ్యతిరేక శక్తులకు కాంగ్రెస్ రక్షణ కల్పిస్తోందని ప్రధాని మోడీ అన్నారు. ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా ప్రధాని ఆదివారం దరంగ్ జిల్లాలో బహిరంగ సభలో కాంగ్రెస్పై కీలకవ్యాఖ్యలు చేశారు. ‘1962లో చైనాతో యుద్ధం తర్వాత అప్పుడు ప్రధానిగా ఉన్న నెహ్రూ ఈశాన్య ప్రాంత ప్రజలకు చేసిన గాయాలు నేటికీ మానిపోలేదు. ప్రస్తుత తరం కాంగ్రెస్ ఆ గాయాలపై ఉప్పు చల్లుతోంది’ అని మోడీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తన రాజకీయాల కోసం భారత్పై వ్యతిరేక భావజాలం ఉన్న వ్యక్తులతో జట్టు కట్టిందని విమర్శించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలోనూ ఆ విషయం బయటపడింద న్నారు. పాకిస్తాన్లోని ఉగ్రవాదులను మన సైన్యం మట్టుబెట్టిందన్నారు. కానీ, హస్తం పార్టీ మాత్రం మన సైన్యానికి కాకుండా దాయాది దేశంలోని సైన్యానికి మద్దతిచ్చిందన్నారు. పాక్ అబద్ధాలు కాంగ్రెస్ ఎజెండాలుగా మారుతున్నాయన్నారు. ప్రస్తుతం ఆక్రమణదారులకు, దేశ వ్యతిరేకులకు ఆ పార్టీ రక్షణ కవచంగా మారిందంటూ.. వారితో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటన్నారు. ఈ కార్యక్రమానికి ముందు దరంగ్ జిల్లాలోని మంగల్డోరులో రూ.6,300 కోట్ల విలువైన ఆరోగ్య, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. దరంగ్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ నిర్మాణంతో పాటు, నర్సింగ్ కాలేజీ, జీఎన్ఎం పాఠశాలను ప్రారంభించారు.