నవతెలంగాణ హైదరాబాద్: వక్ఫ్ (సవరణ) చట్టం-2025లో కీలక ప్రొవిజన్ను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కనీసం ఐదేండ్లపాటు ఇస్లాంను అనుసరించిన వ్యక్తి మాత్రమే ఆస్తిని వక్ఫ్ చేయడానికి అవకాశం ఉంటుందన్న దానిని సర్వోన్నత న్యాయస్థానం నిలిపివేసింది. ఒక వ్యక్తి ఇస్లాంను అనుసరిస్తున్నట్టు నిర్ణయించేలా నిబంధనలు తయారుచేసే వరకు ఇది అమల్లో ఉండదని చెప్పింది.
ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ (సవరణ) చట్టం-2025ను పూర్తిగా నిలిపివేయాలని దాదాపు 100కు పైగా పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. ముస్లింల ఆస్తిని మెల్లగా లాగేసుకొనేందుకే అని వీటిల్లో ఆరోపించాయి. ఇక కేంద్రం మాత్రం పబ్లిక్, ప్రయివేటు ఆక్రణలకు గురికాకుండా రక్షించడానికి అని వాదించింది. దీనిపై స్పందించిన న్యాయస్థానం వక్ఫ్(సవరణ)చట్టం-2025పై మొత్తంగా స్టే విధించడానికి నిరాకరించింది. అయితే కొన్ని సెక్షన్లకు మాత్రం కొంత రక్షణ అవసరమని వ్యాఖ్యానించింది. వక్ఫ్ బోర్డులో ముస్లిం సభ్యుల సంఖ్య కచ్చితంగా మెజార్టీలో ఉండాలని కోర్టు పేర్కొంది. బోర్డ్ లేదా కౌన్సిల్లో అత్యధికంగా ముగ్గురు లేదా నలుగురు ముస్లిమేతర సభ్యులు ఉండాలని చెప్పింది. ఇక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ముస్లిమే ఉండటం మంచిదని కూడా న్యాయస్థానం పేర్కొంది.
వాస్తవానికి ఏప్రిల్లో పార్లమెంట్ ఈ బ్లిల్లును క్లియర్ చేసిన గంటల్లోనే కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ముఖ్యంగా కోర్టులతో వక్ఫ్ ఆస్తిగా గుర్తించినవి, వ్యక్తులు, డీడ్ల ఆధారంగా వక్ఫ్ అయిన ఆస్తుల డీనోటిఫై అధికారాలను దీనిలో ప్రశ్నించారు.