వైద్యులకు బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ అభినందనలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నిమ్స్ వైద్యులు చేస్తున్న కషి అభినందనీయమని బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ అన్నారు. వైద్యుల కషి, పట్టుదల వల్ల చిన్నారుల గుండెలు పదిలంగా మారుతున్నాయన్నారు. నిమ్స్లో ప్రముఖ బ్రిటన్ వైద్యులు డాక్టర్ దన్నపనేని రమణ, నిమ్స్ కార్డియో థోరాసిక్ విభాగాధిపతి డా.అమరేశ్వరరావు సారథ్యంలో చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న గారెత్ విన్ ఓవెన్ సోమవారం హైదరాబాద్ పంజగుట్టలోని నిమ్స్ మిలీనియమ్ బ్లాక్లో పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగాన్ని పరిశీలించారు. ఇక్కడ చిన్నారులకు అందుతున్న వైద్యం పట్ల అరా తీశారు. అత్యుత్తమ సేవ చేస్తున్నారని రమణను ఆయన ప్రశంసించారు. పుట్టుకతోనే గుండె సమస్యలతో బాధ పడుతున్న చిన్నారుల బంగారు భవిషత్తు కోసం ప్రభుత్వ సహకారంతో ఉచితంగా వైద్యం అందించి వారికి కొత్త జీవితాలను ప్రసాదిస్తున్నారనీ, ఇలాంటి ఉత్తమ కార్యక్రమంలో బ్రిటన్ వైద్యులు పాలుపంచుకోవడం ఆనందంగా ఉందని అన్నారు.
నిమ్స్ డైరెక్టర్, డాక్టర్ నగరి బీరప్ప మాట్లాడుతూ గత మూడేళ్ల నుండి తెలంగాణ ప్రభుత్వం, నిమ్స్ గుండె విభాగాధిపతి డాక్టర్ అమరేశ్వర్ రావు సహకారంతో వందలాది గుండె ఆపరేషన్లు విజయ వంతంగా పూర్తి చేసినట్టు తెలిపారు. గుండె జబ్బులతో బాధపడుతున్న చాలా మంది చిన్నారులు చికిత్స కోసం తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పూర్తిగా ఉచితంగానే పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. నిమ్స్ పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం అత్యంత క్లిష్టమైన కార్డియాక్ సర్జరీలను సైతం నిర్వహిస్తోందనీ, ఏడాదికి సుమారు 350కి పైగా సర్జరీలు చేస్తున్నట్టు తెలిపారు.