నవతెలంగాణ-హైదరాబాద్: ఇజ్రాయిల్ గాజాలో ఊచకోతకు పాల్పడిందని ఐక్యరాజ్యసమితి విచారణ కమిషన్ మంగళవారం నిర్థారించింది. గాజాలో మారణహోమానికి ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ సహా ఉన్నతాధికారులు ప్రోత్సహించారని తేల్చింది. ఊచకోత నిర్థారణకు పౌర హత్యల స్థాయి, సాయాన్ని అడ్డుకోవడం, బలవంతంపు స్థానభ్రంశం, సంతానోత్పత్తి కేంద్రాలను ధ్వంసం చేయడం వంటి వాటిని ఉదాహరణలుగా పేర్కొంది.
”గాజాలో ఊచకోత జరిగింది” అని ఆక్రమిత పాలస్తీనా భూభాగంపై విచారణ కమిషన్ చీఫ్, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు మాజీ న్యాయమూర్తి నవీ పిళ్లే అన్నారు. ఈ క్రూరమైన హత్యలకు ఇజ్రాయిల్ ఉన్నతాధికారులతే బాధ్యత. గత రెండేళ్లుగా గాజాలోని పాలస్తీనా ప్రజలను నాశనం చేయాలనే నిర్దిష్టమైన ఉద్దేశంతో మారణహోమాన్ని వారు ప్రోత్సహిస్తున్నారని అన్నారు. కమిషన్ ప్రకటించిన 72 పేజీల చట్టపరమైన విశ్లేషణ ఇప్పటివరకు ఐరాస వెల్లడించిన వాటిలో అత్యంత బలమైనది.
నెతన్యాహూ మరియు ఇతర అధికారుల ప్ర కటనలు ” ఉద్దేశపూర్వక జాతిహత్యకు ప్రత్యక్ష ఆధారాలు” అని కమిషన్ తేల్చింది. ” గాజా ఆపరేషన్ హిబ్రూబైబిల్లో పేర్కొన్నట్లు సంపూర్ణ వినాశనానికి సంబంధించిన పవిత్ర యుద్ధం”గా 2023 నవంబర్లో ఇజ్రాయిల్ సైన్యానికి రాసిన లేఖను కమిషన్ ఉదహరించింది. ఇజ్రాయిల్ అధ్యక్షుడు ఐజాగ్ హెర్జోగ్, మాజీ రక్షణ మంత్రి యోఫ్ గాల్లంట్ పేర్లను కూడా పేర్కొంది. 1994 రువాండా మారణహోమంలో 10లక్షలకు పైగా ప్రజలు మరణించిన ఘటనను ప్రస్తావిస్తూ.. గాజాలో పరిస్థితులు అప్పటి మారణహోమానికి చాలా దగ్గరగా ఉన్నాయని పిళ్లె పేర్కొన్నారు. బాధితులను అమానవీయంగా చూస్తారని, వారిని జంతువులుగా భావిస్తారని, అందుకే మనస్సాక్షి లేకుండా హత్య చేస్తారని అన్నారు. అంతర్జాతీయ న్యాయస్థానం తన 2024 అత్యవసర చర్యల ఉత్తర్వుల్లో.. గాజాలో పాలస్తీనియన్ల హత్యకు ఇజ్రాయిల్ను నిర్థారించినప్పటికీ.. ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ పేరును ప్రస్తావించలేదు. తమ నివేదిక ఫలితంగా.. ఇతర దేశాల మనస్సులు కూడా తెరుచుకోవచ్చని తాను ఆశిస్తున్నానని పిళ్లె అన్నారు.
ఈ మారణహోమాన్ని నిరసిస్తున్న అంతర్జాతీయ సంస్థలు, పలు హక్కుల సంఘాల గొంతుకలకు తాజాగా ఐరాస హక్కుల సంస్థ తన స్వరాన్ని కూడా జోడించింది.
ఐక్యరాజ్యసమితి విచారణ కమిషన్కు సహకరించేందుకు ఇజ్రాయిల్ నిరాకరించింది. యుఎన్ విచారణ కమిషన్ ఇజ్రాయిల్కు వ్యతిరేకంగా రాజకీయ అజెండాను కలిగి ఉందని జెనీవాలోని ఇజ్రాయిల్ దౌత్య కార్యాలయం ఆరోపించింది.