నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్లో చొరబాట్లపై ప్రధాని మోడీ ప్రకటనలు ‘సమస్యను పక్కదారి పట్టించే ఎత్తుగడలు’ అని ఆర్జెడి నేత తేజస్వీయాదవ్ మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ”ఒక్క నిమిషం.. రాష్ట్రంలో చొరబాటుదారులు ఉన్నారని అనుకుందాం. 11ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్నారు. 20 ఏళ్లుగా రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్నారు. ఇప్పటివరకు ఈ సమస్య ఎందుకు గుర్తురాలేదు. ఇంతకాలం ప్రధాని ఏం చేస్తున్నారు” అని ప్రధానిని నిలదీశారు. నితీష్కుమార్ ప్రభుత్వం రాష్ట్రంలో ఒక్క చొరబాటుదారుడినైనా గుర్తించిందా అని ప్రశ్నించారు. గతేడాది జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇదే అంశాన్ని లేవనెత్తారని, ఇదంతా బూటకమని, ఆ విషయాన్ని వారు మరిచిపోయారని ఎద్దేవా చేశారు.
సురక్షిత పాలనను అందించడంలో, ప్రజలకు ఉద్యోగాలు, విద్య, ఆరోగ్య సంరక్షణ అందించడంలో, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఎన్డిఎ ప్రభుత్వం వైఫల్యమైందని.. దీంతో మరోసారి చొరబాటు అంశాన్ని వ్యూహాత్మకంగా తెరపైకి తీసుకువచ్చారని అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డిఎను ఇండియా బ్లాక్ ఓడించనుందని అన్నారు. ‘పడాయి’, ‘దవాయి’, ‘కమె’ౖ, ‘సున్వాయి’ ఔర్ ‘కర్వై’ (విద్య, ఔషదాలు, ఉద్యోగాలు, ఫిర్యాదుల పరిష్కారం మరియు సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం ) అందించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ సందేశంతోనే బీహార్ అధికార్ యాత్రను ప్రారంభిస్తున్నానని అన్నారు.
ప్రధాని మోడీ సోమవారం బీహార్లో పర్యటించిన సంగతి తెలిసిందే. పూర్నియాలో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు చొరబాటుదారులను రక్షిస్తున్నారని, కాపాడుతున్నారని ఆరోపించారు.