నవతెలంగాణ-హైదరాబాద్: రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ఆపడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శాంతి చర్చలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమర్ జెలెన్స్కీతో ట్రంప్ వచ్చేవారం భేటీకానున్నారు. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మంగళవారం తెలిపారు. యుద్ధాన్ని ఆపకపోతే రష్యాపై ఆంక్షలు విధిస్తామని ట్రంప్ పదేపదే బెదిరిస్తున్నప్పటికీ పుతిన్ మాత్రం వాటిని ఏమాత్రం లెక్కచేయడం లేదు. తాజాగా ఈ విషయంపై రూబియో ఇజ్రాయిల్ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ట్రంప్ రష్యా – ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని పలుమార్లు పుతిన్తో చర్చలు జరిపారు. అలాగే జెలెన్స్కీతోపాటు పలుమార్లు సమావేశం కానున్నారు. బహుశా వచ్చేవారం న్యూయార్క్లో ట్రంప్ జెలెన్స్కీతో భేటీ కానున్నారు.
ఒకవేళ ఆయన ఇరు దేశాల నేతలతో శాంతి చర్చలు జరిపి యుద్ధాన్ని ఆపితే.. ట్రంప్ సాధించిన విజయమే. బహుశా ఇది సాధ్యం కాదు అనేంతవరకు ట్రంప్ ప్రయత్నిస్తూనే ఉంటారు’ అని ఆయన అన్నారు. యుద్ధం వల్ల కేవలం జూలై నెలలో రష్యా 20 వేల మంది సైనికుల్ని కోల్పోయిందని ట్రంప్ చెప్పినదాన్ని రూబియో సందర్భంగా ఎత్తిచూపారు. రష్యా, ఉక్రెయిన్, యూరోపియన్లతో కూడా సమర్థవంతంగా మాట్లాడే నేత ట్రంప్. ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపే వ్యక్తి కూడా ఆయనే. శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించగల నేత ఆయనే. ప్రపంచంలో ఇంకెవరు లేరు అని రూబియో అన్నారు.