మంత్రులు కొండా సురేఖ, సీతక్క
సచివాలయ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం లోగో ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సమాజంలో మహిళల పాత్ర కీలకమైనదనీ, వారి కోసం త్వరలో ఒక పాలసీ రూపొందిస్తామని రాష్ట్ర మంత్రులు డాక్టర్ డి. అనసూయ (సీతక్క), కొండా సురేఖ అన్నారు. తమ ప్రభుత్వం మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందనీ, ప్రభుత్వ మహిళా ఉద్యోగులు సమర్థవంతంగా విధులు నిర్వహించి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల ఫలితాలను ప్రజలకు అందించే దిశలో పని చేయాలని కోరారు. మంగళవారం హైదరాబాద్లో తెలంగాణ సచివాలయ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం లోగో ఆవిష్కరించారు. మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కమిటీతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. మహిళలకు ఎన్నో సవాళ్లున్నప్పటికీ విధి నిర్వహణలో అద్భుతంగా రాణిస్తున్నారని కొనియాడారు. మహిళకు ఉద్యోగం అంటేనే అదనపు బాధ్యత అనీ, ఒకవైపు కుటుంబ బాధ్యతలు మరొకవైపు వృత్తి బాధ్యతలను ఏకకాలంలో నిర్వర్తిస్తున్న మహిళా ఉద్యోగులను ప్రశంశించారు. మహిళలు తమ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం కూడా చూసుకోవాలన్నారు.
అన్ని రంగాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను చర్చించేందుకు మహిళ ఉద్యోగులందరితో ఈనెల 22న రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి వారు ఇచ్చే సూచనలు, సలహాల మేరకు ఒక నూతన మహిళా పాలసీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. రాష్ట్రంలో మహిళా సంఘాలు 67 లక్షల మంది మహిళలతో పని చేస్తున్నాయనీ, వివిధ రంగాలలో మహిళా స్వయం సహాయక బృందాలు అద్భుతాలు సృష్టిస్తున్నాయని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లాలో పెట్రోల్ బంకుల నిర్వహణ ద్వారా కేవలం ఒక నెలలో 13 లక్షల రూపాయలు అర్జించాయని వివరించారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ…సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, వారి సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ లక్ష్యాలు, పథకాలు విజయవంతం కావడానికి ప్రభుత్వ ఉద్యోగుల కృషి కీలకమన్నారు. సమావేశంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, మహిళా ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రమాదేవి, సంఘం సభ్యులు శైలజ, మంగ, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
త్వరలో మహిళా పాలసీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES