Thursday, September 18, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుతెలంగాణ విద్యావిధానం దేశానికి దిక్సూచి

తెలంగాణ విద్యావిధానం దేశానికి దిక్సూచి

- Advertisement -

పేదరిక నిర్మూలనకు చదువొక్కటే మార్గం
విజన్‌ డాక్యుమెంట్‌-2047లో విద్యకు ప్రత్యేక అధ్యాయం
భాష, జ్ఞానం, నైపుణ్యాలు, క్రీడలు మేళవింపుతో ఉండాలి
1 నుంచి 12వ తరగతి వరకు సమూల ప్రక్షాళనే ప్రభుత్వ ధ్యేయం
సిలబస్‌, వనరుల సమీకరణ, విధానం అమలుపై స్పష్టత అవసరం : సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
క్షేత్రస్థాయి పరిస్థితులు, అధ్యయనం, భవిష్యత్‌ అవసరాలకు తగినట్టు రూపొందించే తెలంగాణ విద్యావిధానం దేశానికి దిక్సూచిలా మారాలని ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. పేదరిక నిర్మూలన జరగాలంటే విద్య ఒక్కటే మార్గమని అన్నారు. తెలంగాణ విజన్‌ డాక్యుమెంట్‌-2047లో విద్యారంగానికి ప్రత్యేక అధ్యాయం ఉంటుందని చెప్పారు. విద్యారంగాన్ని సమూల ప్రక్షాళన చేయడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఒకటి నుంచి 12వ తరగతి వరకు సమూల మార్పులు రావాల్సిన అవసరముందని చెప్పారు. అందుకోసం సలహాలు, సూచనలు ఇవ్వాలని విద్యావేత్తలను కోరారు. తెలంగాణ విద్యావిధానం రూపకల్పనపై బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కమిటీ చైర్మెన్‌, ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, విద్యాకమిషన్‌ చైర్మెన్‌ ఆకునూరి మురళి, ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ వి బాలకిష్టారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) కె రామకృష్ణారావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, ఎమ్మెల్సీలు ఎం కోదండరామ్‌, పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ఏవీఎన్‌ రెడ్డి, మల్క కొమరయ్య, విద్యావేత్తలు, వీసీలు, సీఎం ముఖ్యకార్యదర్శి వి శేషాద్రితోపాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత విద్యావిధానంలో భాష ఉన్న వారి దగ్గర జ్ఞానం లేదనీ, జ్ఞానం ఉన్న చోట భాష లేదనీ, రెండూ ఉన్న చోట నైపుణ్యాలు లేవని చెప్పారు. ఈ మూడింటి కలబోతగా విద్య ఉండాలని అన్నారు. గతంలో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వాలు భూముల పంపకం నిధుల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టేవని గుర్తు చేశారు. ఇప్పుడు పంపకానికి భూములు, తగినన్ని నిధులు లేవన్నారు. ఇప్పుడు పేదరిక నిర్మూలనకు విద్య తప్ప మరో ఆయుధం లేదని ఆయన స్పష్టం చేశారు. విద్యారంగం ప్రాధాన్యతను గుర్తించినందునే భారత తొలి ప్రధాని నెహ్రూ దేశంలో విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు వంటి ఉన్నత విద్యా సంస్థలను స్థాపించారని గుర్తు చేశారు.

సరళీకృత విధానం అమలైనా విద్యాప్రమాణాలు పెరగలేదు
మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా ఉన్న కాలంలో ఉద్యోగావకాశాలకు అనేక పరిమితులున్నాయని రేవంత్‌రెడ్డి అన్నారు. సరళీకృత ఆర్థిక వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత దేశ, విదేశాల్లో ఉపాధి అవకాశాలు భారీగా పెరిగినప్పటికీ విద్యాప్రమాణాలు ఆస్థాయిలో పెరగకపోవడంతో వాటిని అందిపుచ్చుకోవడంలో విఫలమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాలానుగుణంగా ఇంజినీరింగ్‌ కాలేజీలు వచ్చినందునే పెద్దసంఖ్యలో సాఫ్ట్‌వేర్‌ రంగంలో యువత రాణిస్తున్నదని వివరించారు. రాష్ట్రంలో ఏటా బయటకు వస్తున్న లక్షలాది మంది ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లో పది శాతం మందికి కూడా ఉద్యోగాలు దక్కడం లేదన్నారు. తగినంత నైపుణ్యం లేకపోవడమే అందుకు కారణమ న్నారు. ఆ రంగంలో నైపుణ్యాలు పెంచడంతోపాటు పలు రంగాల్లో అవకాశాలు విస్తృతమైనందున ఆ అవకాశాలు అందిపుచ్చుకునేలా విద్యారంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరముందన్నారు.

నిధులు కేటాయిస్తున్నా సర్కారు బడుల్లో తగ్గుతున్న విద్యార్థులు
విద్యారంగానికి భారీఎత్తున నిధులు కేటాయిస్తున్నా ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతోందని రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రయివేటు పాఠశాలలు నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీతో ప్రారంభిస్తుంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ప్రారంభమవుతు న్నాయని వివరించారు. నర్సరీకి ప్రయివేటు పాఠశాలలో చేరిన వారు తిరిగి ప్రభుత్వ పాఠశాలల వైపు చూడడం లేదన్నారు. విద్యార్థుల రాకపోకలు, తగిన శ్రద్ధ చూపుతారనే కారణంతో తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రయివేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ బడులు ఆ రకమైన ధీమా కల్పించగల్గితే తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్చుతారనీ, తెలంగాణ విద్యా విధానం రూపకల్పనలో ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సీఎం సూచించారు.

డిసెంబర్‌ 9న విజన్‌ డాక్యుమెంట్‌ ఆవిష్కరణ
పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల స్థాయి వరకు విద్యా ప్రమాణాలు పడిపోవడం, నైపుణ్యాల లేమితో ఉద్యోగాలు లభించకపోవడంతో విద్యార్థులు డ్రగ్స్‌ బారినపడి జీవితాలను కోల్పోతున్నారని సీఎం అన్నారు. చదువులు భాష, జ్ఞానం, నైపుణ్యాలు, క్రీడల మేళవింపుతో ఉండాలని చెప్పారు. విద్యారంగంపై చేసిన కృషితోనే తాము సంతృప్తి చెందడం లేదనీ, ప్రాథమిక దశ నుంచి వర్సిటీల వరకు సమూల ప్రక్షాళన చేయాల్సి ఉందన్నారు. రానున్న 25 ఏండ్ల వరకు విద్యా వ్యవస్థకు దిశానిర్దేశం చేసేలా తెలంగాణ విద్యా విధానం ఉండాలని కోరారు. తెలంగాణ విజన్‌ డాక్యుమెంట్‌-2047ను డిసెంబరు తొమ్మిదో తేదీన ఆవిష్కరిస్తామనీ, అందులో తెలంగాణ విద్యా విధానానికి చోటు కల్పిస్తామని వెల్లడించారు. ప్రాథమిక, ఉన్నత, సాంకేతిక, నైపుణ్య విద్యలుగా విభజించుకుని ఇందులో ఉన్న విద్యావేత్తలు తమ అభిరుచులకు అనుగుణంగా సబ్‌ కమిటీలుగా ఏర్పడి అత్యుత్తమ డాక్యుమెంట్‌ను రూపొందించాలని సీఎం కోరారు.

సమాన విద్యావకాశాలుండాలి
విద్యా వ్యవస్థ వ్యక్తులు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం కాకుండా నిరుపేదలకు లబ్ధికలిగేలా ఉండాలని రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాల పేరిట విద్యార్థులను చిన్నతనం నుంచే వేరు చేస్తున్నామనీ, దాన్ని రూపుమాపి అంతా ఒకటే అనే భావన కలిగించేలా విద్యాలయాల్లో అందరికీ సమాన అవకాశాలుండాలని అన్నారు. తెలంగాణ విద్యా విధానం దేశానికి దిక్సూచిలా రూపొందించాలని చెప్పారు. ఆశించిన స్థాయిలో తెలంగాణ విద్యా విధానం అమలయ్యేందుకు వివిధ ఫౌండేషన్లు, ఎన్జీవోల సహకారం తీసుకోవాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమగ్రంగా వినియోగించుకునేలా విద్యా విధానం ఉండాలన్నారు.

ప్రత్యేకంగా విద్యా కార్పొరేషన్‌
విద్య కోసం ఎంత వ్యయానికైనా తాము వెనుకాడమని రేవంత్‌ రెడ్డి చెప్పారు. ప్రత్యేక విద్యా కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి మౌలిక వసతులు, ప్రమాణాల మెరుగుకు ఖర్చు చేయాలని నిర్ణయించామని అన్నారు. విద్యపై చేసే వ్యయాన్ని వ్యయంగా కాక పెట్టుబడిగా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించామన్నారు. విద్యాభివృద్ధికి తీసుకునే రుణాలను ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి నుంచి తొలగించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరామని వివరించారు. తెలంగాణ విద్యా విధానంలో సిలబస్‌ రూపకల్పన, వనరుల సమీకరణ, విధానం అమలుపై స్పష్టత అవసరమని అన్నారు.

ఏఐ వచ్చినా గురువుకు ప్రత్యామ్నాయం కాదు : కేశవరావు
విద్యాకమిషన్‌, ఇతర భాగస్వాములతో విస్తృత సంప్రదింపులు చేశామని తెలంగాణ విద్యా విధానం కమిటీ చైర్మెన్‌ కేశవరావు అన్నారు. గణాంకాల కన్నా నాణ్యత ప్రధానమనీ, విద్యార్థి కేంద్రంగా బోధన ఉండాలన్నారు. ఏఐ వంటి టెక్నాలజీలు ఎన్ని వచ్చినా అవి గురువుకు ప్రత్యామ్నాయం కావన్నారు. విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఐవి సుబ్బారావు, ఐఐటీ హైదరాబాద్‌ డైరెక్టర్‌ బిఎస్‌ మూర్తి, ప్రొఫెసర్‌ హరగోపాల్‌, విద్యావేత్తలు మోహన్‌ గురుస్వామి, ప్రొఫెసర్‌ సుబ్బారావు, సీఐఐ శేఖర్‌ రెడ్డి, అక్షరవనం మాధవరెడ్డి, ఫ్రొపెసర్‌ గంగాధర్‌, విశ్రాంత ఐఏఎస్‌లు మిన్నీ మాథ్యూ, రంజీవ్‌ ఆర్‌ ఆచార్య, శాంతా సిన్హా తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి బి అజిత్‌రెడ్డి, అధికారులు జయేశ్‌ రంజన్‌, శ్రీదేవసేన, కృష్ణ ఆదిత్య, ఈ నవీన్‌ నికోలస్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -