నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. పెన్సిల్వేనియాలోని ఉత్తర కొడోరస్ టౌన్షిప్లో పోలీసులే లక్ష్యంగా దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ముగ్గురు పోలీసు అధికారులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. అయితే పోలీసుల కాల్పుల్లో దుండగుడు కూడా హతమయ్యాడని అధికారులు వెల్లడించారు. కాల్పులకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని పెన్సిల్వేనియా స్టేట్ పోలీస్ కమిషనర్ క్రిస్టొఫర్ పారిస్ తెలిపారు.
కాల్పుల ఘటనపై పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షపిరో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ దేశం, కౌంటీ కోసం పనిచేసిన అత్యంత విలువైన అధికారులను కోల్పోయామన్నారు. ఇలాంటి హింసాత్మక చర్యలు సహేతుకం కాదని చెప్పారు. ఇంకా మెరుగైన సమాజం కోసం అంతా కలిసి పనిచేద్దామని తెలిపారు.