నవతెలంగాణ-హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. ఆకాశానికి చిల్లు పడ్డట్టుగా వరుణుడు ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. ముషీరాబాద్, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, సనత్నగర్, కృష్ణానగర్, మియాపూర్, చందనాగర్, మాదాపూర్, రాయదుర్గం, కేపీహెచ్బీ, సుచిత్ర, గండి మైసమ్మ, దుండిగల్ కాప్రా, ఏఎస్రావు నగర్ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. దీంతో పలు కాలనీల్లో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. యూసుఫ్గూడ కృష్ణానగర్ బి బ్లాక్లో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో వాహనదారులు, వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మాదాపూర్-హైటెక్ సిటీ చౌరస్తా వద్ద భారీ వర్షంతో ట్రాఫిక్ జామ్ అయింది. రాయదుర్గం, అమీర్పేట, బంజారాహిల్స్ ఐకియా మార్గంలో తదితర ప్రాంతాల్లో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. మియాపూర్- చందానగర్ నగర్ మార్గంలో రహదారిపై మోకాలిలోలు నీరు నిలిచిపోయింది. దీంతో ముంబయి జాతీయ రహదారిపై 3 కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి.
ముషీరాబాద్లో అత్యధిక వర్షపాతం
ముషీరాబాద్లో అత్యధికంగా 18.43 సెం.మీ వర్షపాతం నమోదైంది. సికింద్రాబాద్లో 13 సెం.మీ, శేరిలింగంపల్లిలో 12.6 సెం.మీ, చందానగర్లో 11.2 సెం.మీ, లింగంపల్లిలో 10.7 సెం.మీ, జూబ్లీహిల్స్లో 8.9 సెం.మీ, బేగంపేటలో 8.7 సెం.మీ, ఖైరతాబాద్లో 8.5 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.