నవతెలంగాణ – బెంగళూరు : ప్రముఖ కన్నడ నవలా రచయిత, తత్వవేత్త ఎస్.ఎల్.భైరప్ప (94) కన్నుమూశారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల 38 నిముషాలకు గుండెపోటుతో కన్నుమూశారు. పదవీ విరమణ తర్వాత భైరప్ప మైసూరులో నివసిస్తున్నారు. వయస్సురీత్యా అనారోగ్య సమస్యల కారణంగా చికిత్స కోసం ఇటీవల ఆయన బెంగళూరుకు వెళ్లారు. ఈరోజు మధ్యాహ్నం భైరప్పకు గుండెపోటు రావడంతో వెంటను ఆయన్ను బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.
”భారతీయ పురాణ నవలా రచయిత, తత్వవేత్త, పద్మశ్రీ, పద్మభూషణ, సరస్వతి సమ్మాన్ అవార్డు గ్రహీత శ్రీ ఎస్.ఎల్. భైరప్ప ఈరోజు మధ్యాహ్నం 2.38 గంటలకు గుండెపోటుకు గురై సర్వశక్తిమంతుడి పాదపద్మాలను చేరుకున్నారు. ఓం శాంతి !!!” అని రాష్ట్రోత్థాన ఆసుపత్రి తెలిపింది.
వంశవృక్ష, దాతు, పర్వ, మందార వంటి ప్రసిద్ధ నవలలకు భైరప్ప ప్రసిద్ధి చెందారు. ఆయన రచనలు చాలా వరకు ఆంగ్లం ఇతర భాషలలోకి అనువదించబడ్డాయి. ఆయన పద్మభూషణ్, పద్మశ్రీ, సరస్వతి సమ్మాన్, సాహిత్య అకాడమీ అవార్డులను, పలు ఇతర అవార్డులను అందుకున్నారు. నాయీ-నేరలు, మాటదాన, వంశవృక్ష, తబ్బలియు నీనాడే మగనే వంటి అతని కొన్ని రచనలు సినిమాలుగా చిత్రీకరించారు. గృహభంగం, దాతు వంటివి టివి సిరీస్లుగా రూపొందించబడ్డాయి.