సుప్రీం ఆదేశాలు
న్యూఢిల్లీ : పోలీసుల ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టు అగ్ర నేత కట్టా రామచంద్రా రెడ్డి మృతదేహాన్ని భద్రపరచాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఛత్తీస్గఢ్ పోలీసులను ఆదేశించింది. నారాయణ్పూర్ జిల్లాలో సోమవారం ఉదయం చోటు చేసుకున్న బూటకపు ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కట్టా రామచంద్రా రెడ్డి అలియాస్ రాజు, కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసాలు మరణించిన సంగతి తెలిసిందే. అది బూటకపు ఎన్కౌంటరా లేక హింస, వేధింపులకు పాల్పడ్డారా అన్న విషయంపై హైకోర్టు నిర్ణయం తీసుకునే వరకు మృతదేహాన్ని ఖననం చేయరాదని లేదా దహనం చేయరాదని జస్టిస్ దీపాంకర్ దత్తా మరియు జస్టిస్ ఎ.జి.మాసిహ్ లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. దుర్గాపూజ సెలవుల అనంతరం పిటిషన్పై తిరిగి విచారణ చేపట్టాలని హైకోర్టును అభ్యర్థించినందున మృతదేహాన్ని దహనం చేయకూడదు లేక ఖననం చేయకూడదు అని ధర్మాసనం ఆదేశించింది.
ఈ కేసులోని అన్ని వాదనలపై ఎలాంటి నిర్ణయాలను లేదా వైఖరులను తెలియపరచడం లేదని, అలాగే వాటి అర్హతపై కూడా ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం లేదని ధర్మాసనం పేర్కొంది. తన తండ్రిని హింసించి బూటకపు ఎన్కౌంటర్లో చంపారని ఆరోపిస్తూ, పోలీసులు మృతదేహాన్ని ఖననం చేయడానికి ప్రయత్నిస్తున్నారని పిటిషనర్ రాజా చంద్ర పేర్కొన్నారు. పిటిషన్దారు రాజాచంద్ర హైదరాబాద్లోని ఎన్ఎఎల్ఎస్ఎఆర్ లా యూనివర్శిటీలో రీసెర్చర్గా పనిచేస్తున్నారు. ఛత్తీస్గఢ్ అధికారులతో కాకుండా సీబీఐ నేతృత్వంలోని స్వతంత్ర సంస్థ ఆధ్వర్యంలో బూటకపు ఎన్కౌంటర్పై విచారణ చేపట్టాలని, మరోసారి పోస్ట్మార్టం నిర్వహించాలని పిటిషన్ అభ్యర్థించినట్లు ధర్మాసనం తెలిపింది. పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారని, అయితే ఈ అంశాన్ని అత్యవసరంగా విచారించలేమని అనడంతో పిటిషనర్ సుప్రీంకోర్టుకు వచ్చారని పేర్కొంది.
మావోయిస్టు అగ్రనేత కట్టా మృతదేహాన్ని భద్రపరచండి
- Advertisement -
- Advertisement -