ఈజిప్ట్ చేరుకుంటున్న ప్రతినిధి బృందాలు
వాషింగ్టన్ : కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఖరారు చేసుకునేందుకు హమాస్, ఇజ్రాయిల్, అమెరికా ప్రతినిధి బృందాలు ఈజిప్ట్ రాజధాని కైరోకు చేరుకుంటున్నాయి. ప్రతినిధి బృందాల మధ్య సోమవారం చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది. ప్రణాళికలోని అన్ని నిబంధనలకు హమాస్ అంగీకరిస్తుందా, ఇజ్రాయిల్ భద్రతా సమస్యలను ఎలా పరిష్కరిస్తారు అనే అంశాలపై ఇంకా స్పష్టత రావడం లేదు. గాజా నుంచి దళాలను పూర్తిగా ఉపసంహరించుకోవడం జరగదని ఇజ్రాయిల్ స్పష్టం చేసింది. మరోవైపు గాజా ప్రణాళికకు ఆమోదం తెలపాల్సిందిగా ఇజ్రాయిల్, హమాస్పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒత్తిడి పెంచుతున్నారు. సుమారు రెండేండ్లుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు రెండు పక్షాలు ఇప్పటికే అంగీకరించిన విషయం తెలిసిందే. గాజా నుంచి తన దళాల ఉపసంహరణను ప్రారంభించేందుకు ఇజ్రాయిల్ అంగీకరించిందని, హమాస్ కూడా అంగీకారం తెలిపితే కాల్పుల విరమణ తక్షణమే అమలులోకి వస్తుందని, బందీల విడుదల కూడా జరుగుతుందని ట్రంప్ తెలిపారు.
ఈ పరిణామాల అనంతరం దళాల ఉపసంహరణ రెండో దశకు విధివిధానాలను నిర్ణయిస్తామని చెప్పారు. గాజాపై బాంబు దాడిని తాత్కాలికంగా నిలిపివేసేందుకు ఇజ్రాయిల్ అంగీకరించిందని ట్రంప్ చెప్పినప్పటికీ శనివారం గాజా స్ట్రిప్లో జరిగిన దాడుల్లో 67మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క గాజా నగరంలోనే 45 మంది చనిపోయారు. శాంతి ప్రణాళికకు ఆమోదం తెలపడంలో హమాస్ జాప్యం చేస్తే తాను సహించబోనని ట్రంప్ హెచ్చరించారు. యుద్ధానికి స్వస్తి చెప్పాలని, ఆయుధాలు విడిచిపెట్టాల్సిందేనని స్పష్టం చేశారు. శాంతి ప్రణాళికపై హమాస్ స్పందన వెలువడిన తర్వాత ఆయన ఈ హెచ్చరిక చేయడం గమనార్హం. ప్రణాళికలోని కొన్ని అంశాలపై మరింతగా చర్చలు జరగాల్సిన అవసరమున్నదని హమాస్ అభిప్రాయపడిన విషయం తెలిసిందే. కాగా రాబోయే రోజులలో బందీలందరూ విడుదల అవుతారని ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇప్పటికే విఫలమైన రెండు ఒప్పందాలు
యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 17 వేల మంది చిన్నారులు సహా 67 మందికి పైగా పాలస్తీనియన్లు చనిపోయారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయిల్పై హమాస్ జరిపిన దాడితో ఘర్షణలు మొదలయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకూ రెండు సార్లు మాత్రమే కాల్పుల విరమణను పాటించారు. 2023 నవంబరులో మొదటిసారిగా కాల్పుల విరమణ జరిగినప్పటికీ అది వారం రోజులు మాత్రమే కొనసాగింది. ఈ సంవత్సరం జనవరి తర్వాత రెండోసారి కాల్పుల విరమణ అమలులోకి వచ్చినప్పటికీ అది కూడా విఫలమైంది. కాగా ట్రంప్ ప్రతిపాదించిన తాజా శాంతి ప్రణాళికకు హమాస్ అంగీకరించడాన్ని ఖతార్, ఈజిప్ట్, యూఏఈ స్వాగతించాయి.