నవతెలంగాణ-హైదరాబాద్: ఆర్ఎస్ఎస్ ద్వేషపూరిత విషం ఫలితమే సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవారుపై దాడి జరగడానికి కారణమని కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ అన్నారు. ఈ చర్యతో ఆర్ఎస్ఎస్ అత్యున్నత సంస్థల పట్ల ఉన్న గౌరవాన్ని బలహీనపరుస్తుందని ఆయన విమర్శించారు. అయితే ఈ నేపథ్యంలో ఆయనపై సనాతన ధర్మానికి మద్దతునిచ్చే ఓ లాయర్ దాడికి ప్రయత్నించినప్పటికీ ఆయన తన స్థానం నుంచి కదలకుండా ప్రశాంతంగా ఉన్నందుకు సిజేఐ బిఆర్ గవారుని ఠాగూర్ ప్రశంసించారు. ఈ మేరకు ఆయన సోమవారం సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు.
‘ఈరోజు సుప్రీంకోర్టులో షాకింగ్ ఘటన జరిగింది. విచారణ సమయంలో సిజెఐ గవారుపై లాయర్ షూ విసిరేందుకు యత్నించారు. కోర్టులో ఆ సమయంలో గందరగోళం నెలకొన్నప్పటికీ ప్రధాన న్యాయమూర్తి ప్రశాంతంగా, గౌరవంగా కదలకుండా ఉన్నారు. అదే నిజమైన నాయకత్వం. గవారు ప్రశాంతత భారతదేశ న్యాయవ్యవస్థ బలాన్ని ప్రతిబింబిస్తుంది. ద్వేషం మన సంస్థల్ని కదలించడానికి ప్రయత్నించినప్పటికీ.. దానికి వ్యతిరేకంగా అండగా నిలబడటం అంటే ఇదే అని మాణిక్యం ఠాగూర్ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. అలాగే ఈ సందర్భంగా ఆయన ఆర్ఎస్ఎస్పై తీవ్రంగా విమర్శించారు. నిజం చెప్పాలంటే.. ఇది కేవలం ఒక వ్యక్తి పిచ్చి కాదు. ఇది వంద సంవత్సరాల ఆర్ఎస్ఎస్ ద్వేషపూరిత విషం మెదడులకెక్కింది. సంస్థల పట్ల ఉన్న గౌరవాన్ని బలహీనపరుస్తోంది. దీని ఫలితమే ఈరోజు సిజేఐపై దాడికి యత్నం అని ఠాగూర్ ఎక్స్ పోస్టులో తెలిపారు.