నవతెలంగాణ – హైదరాబాద్: కొలంబో నుంచి 158 మంది ప్రయాణికులతో చెన్నైకి వస్తున్న ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తృటిలో తప్పింది. విమానం గాల్లో ఉండగా ఒక పక్షి వేగంగా ఢీకొట్టింది. అయితే, పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని చెన్నై విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
వివరాల్లోకి వెళితే, ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 737-800 విమానం (AI-411) మంగళవారం మధ్యాహ్నం కొలంబో నుంచి చెన్నైకి బయలుదేరింది. విమానం చెన్నై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) పరిధిలోకి ప్రవేశించిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ప్రయాణ సమయంలో ఎటువంటి కుదుపులు గానీ, సమస్యలు గానీ తలెత్తకపోవడంతో ప్రయాణికులు దీన్ని గమనించలేదు.
విమానం చెన్నైలో సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత ఇంజనీరింగ్ సిబ్బంది సాధారణ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో విమానాన్ని పక్షి ఢీకొట్టినట్లు గుర్తించి, స్వల్పంగా సాంకేతిక లోపం తలెత్తినట్లు నిర్ధారించారు. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ముందుజాగ్రత్త చర్యగా, విమానాన్ని తాత్కాలికంగా నిలిపివేసి (గ్రౌండెడ్) పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టారు.
ఈ పరిణామంతో చెన్నై నుంచి తిరిగి కొలంబో వెళ్లాల్సిన విమాన సర్వీసును ఎయిరిండియా రద్దు చేసింది. కొలంబో వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న 137 మంది ప్రయాణికుల కోసం సంస్థ ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేసింది.