నవతెలంగాణ – దుబ్బాక
దుబ్బాక మున్సిపల్ కేంద్రం నుండి సిద్దిపేట, గజ్వేల్, హైదరాబాద్ లకు వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. రోడ్డుపై అడుగడుగునా పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. అందులో నీరు నిలిచి రాకపోకలకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్, ప్రభుత్వ ఏరియా హాస్పిటల్, తహసీల్దార్, పంచాయతీరాజ్, ఫారెస్ట్ కార్యాలయాలకు వెళ్లాలంటే కూడా ఈ రూట్లోనే వెళ్లాలి తప్పా మరో దారి లేదు. ప్రతినిత్యం వందల సంఖ్యలో ప్రయాణికులు, వాహనదారులు ఇదే దారిలో ప్రయాణిస్తుంటారు. గుంతల్లో పడి పలువురికి గాయాలయ్యాయి.
వర్షాలకు గుంతల్లో నీరు నిలిచి లోతు తెలియడంలేదు. వేగంగా వచ్చే వాహనదారులు అకస్మాత్తుగా బ్రేకులు వేసి అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు పరిశీలించి గుంతలను పూడ్చి రహదారిని బాగు చేయాల్సిన అవసరముంది. సంబంధిత అధికారులు కనీసం తాత్కాలిక మరమ్మతులు కూడా చేయడం లేదు.