నవతెలంగాణ-హైదరాబాద్: చండీగఢ్: హరియాణాకు చెందిన సీనియర్ పోలీస్ అధికారి వై.పూరణ్ కుమార్ ఆత్మహత్య కేసులో సమగ్ర దర్యాప్తు కోసం చండీగఢ్ పోలీసులు ఆరుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. ఈ దర్యాప్తును నిర్దేశించిన కాలవ్యవధిలో పూర్తి చేయాలని ఆదేశించారు. సిట్కు చండీగఢ్ ఐజీ పుప్పేంద్ర కుమార్ నాయకత్వం వహిస్తారు. చండీగఢ్ ఎస్ఎస్పీ కన్వర్దీప్ కౌర్, సిటీ ఎస్పీ కేఎం ప్రియాంక, డీఎస్పీ చరణ్జిత్ సింగ్ విర్క్, ఎస్డీపీవో (సౌత్) గుర్జీత్ కౌర్, సెక్టార్ 11 పోలీస్ స్టేషన్ (వెస్ట్) ఎస్హెచ్వో జైవీర్ రాణా సభ్యులుగా ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఐపీఎస్ అధికారి పూరణ్ కుమార్ మంగళవారం చండీగఢ్లోని తన నివాసంలో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడం తెలిసిందే. తన సూసైడ్ నోట్లో అనేక మంది సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను పేర్కొన్నారు. ప్రధానంగా హరియాణా డీజీపీ శత్రుజీత్ కపూర్, రోహ్తక్ ఎస్పీ నరేంద్ర బిజార్నియా తనను వేధించారని, అపఖ్యాతి పాలు చేశారని ఆరోపించారు. దీని ఆధారంగా చండీగఢ్ పోలీసులు ఆత్మహత్యకు ప్రేరేపించడం, ఎస్సీ, ఎస్టీ చట్టంలోని కొన్ని నిబంధనల కింద గురువారం సాయంత్రం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సూసైడ్ నోట్లో పేర్కొన్న నిందితులపై సెక్షన్ 108 ఆర్/డబ్లు్య 3(5) (ఆత్మహత్యకు ప్రేరణ), 3 (1) (ఆర్) పీవోఏ (అకృత్యాల నివారణ) ఎస్సీ/ఎస్టీ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు చండీగఢ్ పోలీసులు గురువారం సాయంత్రం ఒక ప్రకటనలో వెల్లడించారు.