నూతన అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ : ఏఐసీసీ అబ్జర్వర్ నవజ్యోతి పట్నాయక్
హనుమకొండలో విలేకరుల సమావేశం
నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా
పారదర్శకత, నిబద్ధత, సామర్థ్యం, కార్యకర్తల అభిమానం కలిగి ఉండడమే కొలమానంగా చూస్తామని, వారికే కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం ఉంటుందని వరంగల్, హనుమకొండ జిల్లాల ఏఐసీసీ అబ్జర్వర్ నవజ్యోతి పట్నాయక్ తెలిపారు. ఆదివారం హనుమకొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన డీసీసీ అధ్యక్షుల నియామకం కోసం హనుమకొండ, వరంగల్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా అధ్యక్షుల ఎంపిక విధానంలో కాంగ్రెస్ పార్టీ సంఘటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమం చేపడుతున్నట్టు చెప్పారు. పార్టీ కార్యకర్తలు, మాజీ పదవీదారులు, ప్రస్తుత ప్రజా ప్రతినిధులు, సివిల్ సొసైటీ సభ్యులు, సీనియర్ నాయకుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటామని అన్నారు. ఈ అభియాన్ ద్వారా అధికారం కేవలం కొంతమందికి మాత్రమే పరిమితం కాకుండా, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు, మహిళలు, యువత వంటి అన్ని వర్గాలకు నాయకత్వ అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. వినయంతో, దూరదృష్టితో, ప్రజా సమస్యల పట్ల నిబద్ధత కలిగిన నాయకులను సూచించాలని కోరారు.
పార్టీ పునర్నిర్మాణంలో కార్యకర్తలు, నాయకుల పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని అన్నారు. నూతన అధ్యక్షుల ఎంపిక ప్రక్రియలో ప్రతి నియోజకవర్గ ముఖ్య నేతలతో సంప్రదింపులు చేస్తామని తెలిపారు. నేడు (సోమవారం) హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ జిల్లా స్థాయి ముఖ్య నాయకులు, ప్రతినిధులతో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ స్థాయి నాయకులతో సమీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ నెల 14న వరంగల్లో పరకాల నియోజవర్గ కాంగ్రెస్ నాయకులతో, 16న తూర్పు నియోజకవర్గం, 17న వర్ధన్నపేట, 18న నర్సంపేట నియోజకవర్గం పరిధిలోని కాంగ్రెస్ శ్రేణులతో సమావేశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాల అబ్జర్వర్లుగా వచ్చిన దుర్గం భాస్కర్, మసూద్, రేణుక, కో ఆర్డినేటర్ ఆదర్శ్ జైస్వాల్తోపాటు ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ జక్కుల రవీందర్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు పింగిలి వెంకట్రాం నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్, సీనియర్ నాయకులు వీసం సురేందర్ రెడ్డి, రహీమున్నీసా బేగం, కట్ట రఘుపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.