”ఆత్మశుద్ధి లేని యాచారమదియేల? భాండశుద్ధి లేని పాకమేల? చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా? విశ్వదాభిరామ వినురవేమ”. ఏనాడో వేమన చెప్పిన ఈ పద్య తాత్పర్యాన్ని పెడచెవిన పెట్టడమే కాదు, ”ఆచరించనిదే ఆడంబర మదియేల, అనుసరిం చనిదే యట్టి ప్రచార మదియేల” అని చెప్పించుకునే స్థితిలో నేతల ప్రవర్తనలున్నవి. ఆపరేషన్ సింధూర్ అనంతరం ఇప్పుడు స్వదేశీ వస్తువుల వినియోగంపై నేతల పెద్దపెద్ద ప్రగల్భాల ప్రసంగాలు వినిపిస్తు న్నాయి. పాపం ఈ ప్రసంగాలు నిజమనుకుని సాధారణ ప్రజానీకం సోషల్ మీడియా ఆయుధాలతో విషప్రచారానికి గురవుతున్నారు. ఈ స్వదేశీ నినాదం వినిపించే నాయకులను అడగవలసిన అనేక ప్రశ్నలు ఉన్నవి. మొట్టమొదటిది, విదేశీ వస్తువులని మన దేశంలోకి ఆహ్వానిస్తున్నది ఎవరు? విదేశీ వస్తువులు మాకు కావాలి అని ఎక్కడైనా పోరాటాలు లేదా అభ్యర్థనలు ప్రజలనుండి జరిగాయా?వస్తు సేవలను వినియోగి స్తున్న వారందరూ స్వదేశానివి వద్దు విదేశీవి మాత్రమే కావాలని ఎక్కడైనా పట్టు బట్టారా? ఇట్లాంటి మౌలిక అంశాలను వదిలిపెట్టి ”విదేశీ వస్తువులను బహిష్కరించండి, చివరికి చిన్న చిన్న వినాయకుల విగ్రహాలను కూడా విదేశాల్లో తయారు చేయబడిన వాటిని వినియోగిస్తున్నారు” అంటూ ప్రజలను ముద్దాయిలను చేసే ప్రసంగాలు అర్ధరహితమైనవి. చిన్న చిన్న వినాయక విగ్రహాలు కాదు 3300 కోట్ల రూపాయల ప్రాజెక్ట్గా చెప్పబడుతున్న సర్దార్ వల్లభాయి పటేల్ విగ్రహాన్ని తయారు చేసింది కూడా విదేశీ సంస్థలే నన్న విషయం ప్రజలకు తెలియదనుకుంటే ఎలా? స్వదేశీ నినాదం కేవలం రాజకీయ లబ్ధి కోసం, ఓట్లు దండుకోవడం కోసం లేదా చైనాను పరోక్షంగా విమర్శించడం కోసం చేసే కుటిల ప్రయత్నాలే తప్ప చిత్తశుద్ధి ఎక్కడా లేదు.
నూతన ఆర్థిక విధానాలకు బార్లా తలుపులు తెరిచి, విదేశీ సంస్థలు తమ ఇష్టానుసారం తమ వస్తువులను ప్రపంచ మంతా అమ్ముకోవచ్చని, భారతదేశం అందరికీ ఆహ్వానం పలుకుతున్నదని చెప్పినది ప్రభుత్వాలా లేక ప్రజలా? ఇప్పటికి కూడా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ (ఎఫ్డీఐ)దకి అర్రులు చాస్తూ ఆహ్వానిస్తున్నది ప్రజలా, ప్రభుత్వాలా? భారతదేశంలో తయారైన సి విటమిన్ ట్యాబ్లెట్లు కూడా అమెరికా హెచ్చరిస్తే ఇక్కడ అవసరాలను ఏమాత్రం అంచనా వేయకుండా అమెరికాకు ఎగుమతి చేసింది ప్రభుత్వాలా, ప్రజలా? ఈరోజు విదేశీ నిల్వలు దేశాల ఆర్థిక పటిష్టతకు ఆనవాళ్లుగా మారిపోయాయి. ఈవిదేశీ నిల్వల కోసం ఆరాటపడుతున్నది ప్రజలా ప్రభుత్వాలా? ”డిపార్ట్మెంట్ అఫ్ కామర్స్” అనుమతిలేనిదే విదేశీ వస్తువుల దిగుమతి జరుగుతుందా? ”డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్” వారి అనుమతి లేనిదే విదేశీ వస్తువుల దిగుమతిపై నియమ నిబంధనలు రూపొందించ పడుతున్నాయా? వాటి నాణ్యతను అవసరాన్ని ధ్రువీకరిస్తున్నది ఈ డీజీఎఫ్టీ కదా? మారిన పరిస్థితుల్లో ఆన్లైన్ వ్యాపారాలు పెరగడం వల్ల ”అంతర్జాతీయ ఆన్లైన్ సప్లింగ్ స్టోర్స్”ని ఏర్పాటు చేసింది భారతదేశ ప్రభుత్వమా లేక ప్రజలా? ఇలాంటి వ్యాపార అభివృద్ధి కోసం ”ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్” స్థాపించింది మన ప్రభుత్వం కాదా! దీనికోసం”ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్” అనే సంస్థను ఏర్పాటుచేసింది మన ప్రభుత్వమేగా! వీటన్నిటినీ మించి కస్టమ్స్ డిపార్ట్మెంట్ ప్రభుత్వానికి రావాల్సిన నిధుల కోసం ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ వ్యవహారాలను చక్కబెట్టడం లేదా? ప్రభుత్వాలు అంతర్జాతీయ ప్రమాణాలను పాటించాల్సిన దుస్థితి ఏర్పడింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తమ దేశానికి ఎవరైనా, ఏవైనా వస్తువులను పంపించాలంటే అనేక షరతులు విధిస్తూ, టారిఫ్ పెంచుతూ గెంతులు వేస్తున్నాడు. వాటిని కాదనలేని స్థితిలో చాలా దేశాలతో పాటు భారత్ కూడా ఉన్నది. అనేక వస్తువులను దిగుమతి చేసుకోనిదే పూట గడిచే పరిస్థితి లేని పరస్పర ఆధారిత ఆర్థిక వ్యవస్థలుగా దేశాల పరిస్థితి ఉన్నది.
భారత దేశంనుంచి అనేక వస్తువుల మరియు సేవల ఎగుమతి మనం అనుమతించే దిగుమతులపై ఆధారపడి ఉన్నది. చమురు దిగుమతి చేసుకోనిదే దీపం వెలిగే పరిస్థితి లేదు. అది విదేశీ వస్తు కదా అని నిషేదించగలంమా? మేక్ ఇన్ ఇండియా పేరు మీద భారత వాయుసేనకు,మిలిటరీకి ఉపయోగపడే యుద్ధ సామాగ్రిని పదేళ్లలో మనం పెంచుకోవాలని పూనిన ప్రతిజ్ఞలన్నీ ఏమైనట్లు? తాజాగా కూడా రఫెల్ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్సుకి దరఖాస్తు పెట్టుకోవాల్సి వచ్చింది? ఇలా చేయమని ప్రజలెవరైనా కోరుతున్నారా? పాలనుండి మొదలు బీఫ్ వరకు, గోధుమల నుండి మొదలు కాటన్ వరకు, పువ్వుల నుండి మొదలు చేపల వరకు అనేక ఆహారపదార్థాలను ఎగుమతి చేస్తున్నాం. అదే సందర్భంలో వ్యవసాయోత్పత్తులను ఉండి మొదలు కర్మాగారాలకు అవసరమయ్యే పారిశ్రామిక ఉత్పత్తులను దిగుమతి చేసు కోవాల్సిన పరిస్థితి కూడా ఉన్నది. సాంకేతికత పెరిగిన తర్వాత చేతివృత్తులు దాదాపు కనుమరుగైపోయాయి. ప్రతీ పనిముట్టు యాంత్రీకరణ ద్వారా తయారవుతుంది.ఆపిల్ కంపెనీ భారతదేశంలో తమ యూనిట్ను నెలకొల్పి ఐఫోన్లు తయారు చేస్తామని ముందుకు వస్తుంటే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బాహాటంగా వ్యతిరేకిస్తూ ఆపిల్ కంపెనీ యాజమాన్యాన్ని బెదిరిస్తున్నాడు. దీనిపై ఇక్కడి అధికారులు ఏ మాత్రం స్పందించక పోవడం దేనికి సంకేతం? అనేక కంపెనీలకు చైనా అమెరికాలు స్థావరంగా ఉన్నవి. అక్కడ పనిచేస్తున్న సాంకేతిక నిపుణులలో అత్యధిక శాతం భారత సంతతియే. మరి అలాంటి నైపుణ్యం గల భారతీయులను ఇక్కడ వినియోగించడానికి తీసుకుంటున్న చర్యలు శూన్యం! ఇక్కడి మేధో సంపత్తి మొత్తం వలసెళ్తూనే ఉన్నది. విద్యా విధానాన్ని సరిదిద్దుకుని, అంతర్జాతీయ విద్యాసంస్థలను ఏర్పాటుచేసి, వృత్తివిద్యాకోర్సులను విపరీతంగా అమలు పరిచి, సహజసంపదను వినిమయ రూపంలోకి మార్చే ప్రయత్నాలు చేయనప్పుడు దేశ ప్రజలకు కావాల్సిన వస్తువులన్నీ ఈ దేశంలోనే తయారయ్యే అవకాశం ఎక్కడుంది! విచిత్రమేమంటే స్వదేశీ నినాదాన్ని సభా వేదికల ద్వారా వినిపించే నాయకులు వినియోగించే కార్ల నుండి కళ్లద్దాలవరకు విదేశాల్లో తయారైతే తప్ప దిక్కులేదు.
స్వదేశీ నినాదం భారత ప్రజలను బాగా ఆకర్షిస్తుంది. దీనికి కారణమేమంటే స్వాతంత్రోద్యమంలో పాటించిన ఈ స్వదేశీ నినాదం బాగా సఫలమైంది. అనేక సినిమాలు విదేశీ వస్తు బహిష్కరణ స్వాతంత్రోద్యమకారులు ఏ విధంగా పాటించారో చూపించి భావోద్వేగాలను తట్టిలేపారు. ఈ స్వదేశీ నినాదానికి సంబంధించిన చరిత్రను ఒకసారి గమనిస్తే 1905లోనే ఈ స్వదేశీ నినాదం బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగసిపడింది. ఆ తర్వాత బ్రిటిష్ అణచివేతకు, మొదటి ప్రపంచ యుద్ధ ప్రభావానికి అది సద్దుమణిగింది. 1922లో మహాత్మాగాంధీ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా మళ్లీ ఈ స్వదేశీ నినాదం బహు ప్రాచుర్యంలోకి వచ్చి, విదేశీ వస్తువులన్నింటినీ బహిష్కరించాలని పిలుపునే భారత ప్రజలందరూ పాటించారు. ముఖ్యంగా బ్రిటిష్ వారి నుండి దిగుమతి అయ్యే వస్త్రాలు, లిక్కర్, ఉప్పు వంటివాటిని పూర్తిగా వ్యతిరేకించారు. ఉప్పు తయారీ కోసం ఉప్పు సత్యాగ్రహం అనే పెద్ద ఉద్యమాన్నే గాంధీజీ ఆధ్వర్యంలో చేపట్టాల్సి వచ్చింది. ఆర్థిక స్వయం సమృద్ధి సాధిస్తే దేశం దానంతటదే రాజకీయ స్వేచ్ఛ సాధించే అవకాశం ఉన్నదని నాటి స్వాతంత్య్ర సమరయోధులు భావించి, దానికోసం స్వదేశీ నినాదాన్ని దేశ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. స్వదేశంలో అన్ని సమకూరాలంటే యువతకి ప్రత్యామ్నాయ ఉపాధి వృత్తివిద్యా కోర్సుల ద్వారా అందించాలని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఇంజనీరింగ్ తప్ప ఇతర ఒకేషనల్ కోర్సులు ఏవి ప్రత్యామ్నాయంగా అందుబాటులో లేవు. ప్రభుత్వాలు ఆ వైపు దృష్టి పెట్టడమే లేదు. స్వాతంత్య్రానంతరం కూడా స్వదేశీ నినాదాన్ని విడిచిపెట్టలేదు. జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో విదేశీ కంపెనీలన్నింటినీ విలీనం చేసి స్వదేశీ సంస్థలుగా ఏర్పాటు చేశారు. ఇనుము, ఉక్కు కర్మాగారాలు, చమురుశుద్ధి కర్మాగారాలు స్థాపించుకోకపోతే మనుగడ అసాధ్యమని భావించి, బ్రిటన్, రష్యా, వెస్ట్ జర్మనీ వంటి దేశాల సహకారంతో మన దేశంలో స్థాపించారు, గనుకనే ఇప్పుడు ఉక్కును ఎగుమతి చేసే దేశాల్లో భారత్ అగ్రగామిగా ఉంది. ”మంగళ్ యాన్ మిషన్” సక్సెస్ ఫుల్గా ప్రయోగిస్తున్న నేటి భారత్ 1962 నాటి స్వదేశీ విధానంలో నిర్ణయమేనని మర్చిపోకూడదు. దీన్ని బట్టి అర్ధమవుతున్నదేమంటే పాలకులు విదేశీ వస్తువులను బహిష్కరించమని ఇవ్వాల్సింది నినాదాలు కాదు, స్వదేశంలో వస్తుత్పత్తులు తయారయ్యే పరిస్థితులు ఏర్పరచాలి, ప్రోత్సహించాలి. తద్వారా విదేశీ వస్తువులు తమంతటవే దిగుమతి కావడం ఆగిపోతాయి.
అనేక దేశాలు అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని తమ దేశంలోని నైపుణ్యాలను వివిధ రూపాల్లో వినియోగించుకుంటూ యువతకు ప్రోత్సాహకాన్ని ఇవ్వడం వలన అత్యంత చౌకగా మరింత నాణ్యత కలిగిన వస్తువులను తయారు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు. ”చిన్న గణేష్ బొమ్మను కూడా విదేశాల్లో తయారైన దాన్ని వాడుతున్నారు” అని ప్రజలపై పడి ఏడవడం ప్రభుత్వ పెద్దల అసమర్ధతకు నిదర్శనం. భారతదేశంలో పూజించబడే దేవతా విగ్రహాలు చైనా, అమెరికా దేశ ప్రజలకు ఏ మాత్రం అవసరం లేదు, కానీ వాటిని అత్యంత ఆకర్షణత్మకంగా తయారు చేసి, మార్కెట్ చేసుకుంటున్నారు. అలా చేసుకోవడానికి మన దేశమే అనుమతులిస్తోంది. అనేక ఎలక్ట్రానిక్ పరికరాలు మన దేశంలో ఉత్పత్తి కావడం లేదు. అత్యధిక శాతం దిగుమతి చేసుకునే పరిస్థితి ఉన్నది. ఏది ఆకర్షణగా ఉంటే దాని వినియోగదారుడు కొనుక్కోడానికి సిద్ధపడతాడు. స్థానికత కోసం గళమెత్తండి అని చెప్పే ముందు స్థానికంగా ప్రతివస్తువు తయారయ్యే పరిస్థితులను ప్రభుత్వాలే సృష్టించాలి.ఉత్పాదక రంగంలో విదేశీ పెట్టుబడులను కూడా ఆహ్వానించవచ్చు దాని వలన ఇక్కడ ఎందరికో ఉపాధి లభిస్తుంది. తద్వారా స్వదేశంలో వస్తుత్పత్తి పెరుగుతుంది. కానీ సేవారంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను, నైపుణ్యాన్ని వినియోగించడం వల్ల ఉపాధి ఏమీ పెరగకపోగా భారతీయ పొదుపుపై విదేశీ పెట్టుబడి అజమాయిషీ పెరిగిపోయి మరింత నష్టం ఏర్పడుతుంది. ఈ సూక్ష్మం తెలియకనేమీ కాదు, కానీ అంతర్జాతీయ పెట్టుబడి ఒత్తిళ్లకు తలొగ్గివారికి దాసోహ మంటున్నారు. ఇది బయట పడనీయకుండా స్వదేశీ నినాదాన్ని అప్పుడప్పుడూ వినిపించి ప్రజల మెదళ్లను విషపూరితం చేస్తూ తాము తప్పించుకుంటున్నారు. ఇది గర్హనీయం.
జి.తిరుపతయ్య
9951300016
చిత్తశుద్ధి లేని స్వదేశీ నినాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES