గచ్చిబౌలిలో పోలీసుల అదుపులో ఐదుగురు
రూ.8 లక్షల సొత్తు స్వాధీనం
నవతెలంగాణ-మియాపూర్
హైదరాబాద్ నగరంలో ఖరీదైన విదేశీ మద్యం బాటిళ్లలో చౌక రకపు మద్యాన్ని నింపి విక్రయిస్తున్న ముఠాను శంషాబాద్ టాస్క్ఫోర్స్, ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. మాదాపూర్, కేపీహెచ్బీ, కొండాపూర్ ప్రాంతాల్లో నిర్వహించిన వరుస దాడుల్లో ఐదుగురు నిందితులను అరెస్టు చేసి, సుమారు రూ.8 లక్షల సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు.. గురువారం ఉదయం 6 గంటల సమయంలో గచ్చిబౌలి ఫ్లైఓవర్ సమీపంలోని ఇందిరానగర్ – లింగంపల్లి రోడ్డుపై అధికారులు నిఘా పెట్టారు. స్కూటీపై వెళ్తున్న వ్యక్తులను తనిఖీ చేయగా, వారి వద్ద 15 బాటిళ్ల నకిలీ గ్లెన్లివిట్ మద్యం లభించింది. విచారణ జరిపారు. ప్రధాన నిందితుడు ఏ1 ధీని ప్రకాష్గౌడ్(కేపీహెచ్బీ నివాసి) బార్నీస్ బీర్ కంపెనీలో సేల్స్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాడు. ఏ2 గద్వాల్ భరత్ మాదాపూర్లో నివాసం ఉంటూ మద్యం రవాణాలో సహకరిస్తున్నాడు. ప్రకాష్గౌడ్ ఇచ్చిన సమాచారంతో కేపీహెచ్బీలోని అతని నివాసంలో సోదాలు చేయగా గ్లెన్ఫిడిచ్, చివాస్ రీగల్, డేవార్స్, బ్లూ లేబుల్, అమృత్ వంటి ప్రముఖ బ్రాండ్లకు చెందిన 46 నకిలీ బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ముఠాకు నకిలీ మద్యం సరఫరా చేస్తున్న మృత్యుంజయ మహంతిని కొండాపూర్లో అదుపులోకి తీసుకున్నారు. ఇతను హైదరాబాద్లో బార్ టెండర్గా పనిచేస్తూ, ఈ అక్రమ వ్యాపారానికి తెరలేపాడు. నిందితులు వివిధ ఈవెంట్లలో ఖాళీ అయిన ఖరీదైన మద్యం బాటిళ్లను సేకరించేవారు. వాటిలో తక్కువ ధర కలిగిన ‘ఆఫీసర్స్ ఛాయిస్, ‘ఓక్ స్మిత్ణ వంటి మద్యాన్ని నింపి, ఎవరికీ అనుమానం రాకుండా సీల్ వేసి విక్రయించేవారు. రెండు నెలలుగా నిందితులు ఈ దందాను కొనసాగిస్తున్నట్టు విచారణలో తేలింది. ఈ దాడుల్లో అధికారులు నకిలీ విదేశీ మద్యం బాటిళ్లు139, ఖాళీ విదేశీ మద్యం బాటిళ్లు136, మొబైల్ ఫోన్లు 4, స్కూటీలు 3, ప్యాకింగ్ మెటీరియల్ ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్లో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ దశరథ్, శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ, ఏఈఎస్ శ్రీనివాస్రెడ్డి పర్యవేక్షణలో డిస్ట్రిక్ట్ టాస్క్ఫోర్స్ సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ శ్రీకాంత్రెడ్డి, చందానగర్ సీఐ లక్ష్మణ గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.



