టీజీఓ సంఘం ఆధ్వర్యంలో సన్మాన మహోత్సవం
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
నిజామాబాద్ జిల్లాలో వివిధ శాఖలలో విధులు నిర్వర్తిస్తున్న ఐదుగురు అధికారులు ఈ నెల 31న పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా బుధవారం వారికి ఘనంగా వీడ్కోలు పలికారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సన్మాన మహోత్సవం నిర్వహించారు. కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి, పదవీ విరమణ చేస్తున్న జిల్లా కార్మిక శాఖ అధికారి యోహన్, ఎస్సీ కార్పోరేషన్ ఈ.డీ రమేష్, పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ జగన్నాథ చారీ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థకు చెందిన ఏ.పీ.ఓలు లక్ష్మారెడ్డి, పీ.వీ.రమణల ను పూలమాలలు, శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలు బహూకరించారు. వారు అందించిన సేవలను వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఒకేసారి ఐదుగురు అధికారులు పదవీ విరమణ చేస్తుండడం జిల్లా యంత్రాంగానికి ఎంతో లోటు అని అన్నారు. అయితే ఉద్యోగులకు పదవీ విరమణ సహజమని, ముప్ఫై సంవత్సరాలకు పైగా వివిధ హోదాలలో ఎలాంటి రిమార్క్స్ లేకుండా సేవలు అందించడం ఎంతో గొప్ప విషయం అని అన్నారు. అనేక సందర్భాల్లో కుటుంబ సభ్యులతో సమయం గడిపే అవకాశం లేకుండా ఉద్యోగులు విధి నిర్వహణలో నిమగ్నం కావాల్సి వస్తుందని అన్నారు. పదవీ విరమణ చేస్తున్న అధికారులు
వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో గడపాలని కలెక్టర్ ఆకాంక్షించారు. విరమణ పొందిన అధికారులు తమకు నచ్చిన వ్యాపకాన్ని ఎంచుకుని మానసిక ప్రశాంతతతో, కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదకరమైన జీవనం వెళ్లదీయాలని సూచించారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ లు మాట్లాడుతూ, రిటైర్ అవుతున్న ఐదుగురు అధికారులు కూడా ఎంతో సమర్ధవంతంగా సేవలు అందించారని ప్రశంసించారు. వారితో కలిసి పని చేసిన సందర్భాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
కాగా, తమ ఉద్యోగ నిర్వహణలో సహకరించిన ప్రతి ఒక్కరికి పదవీ విరమణ చేస్తున్న అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు కిషన్, కార్యదర్శి అమృత్ కుమార్, డీఆర్డీఓ సాయాగౌడ్, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రవీందర్, ఆయా శాఖల అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొన్నారు.