Sunday, December 21, 2025
E-PAPER
Homeజాతీయం'ఉపాధి హామీ' కోసం దేశవ్యాప్త ఉద్యమం

‘ఉపాధి హామీ’ కోసం దేశవ్యాప్త ఉద్యమం

- Advertisement -

వీబీ జీ రామ్‌ జీ బిల్లుతో పేదలకు ఉపయోగం లేదు
ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏను కొనసాగించాలి : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు

అమరావతి : కొత్తగా తీసుకొచ్చిన వీబీ- జీ రాం జీ బిల్లుతో పేదలకు ఎటువంటి ఉపయోగమూ లేదని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి రాఘవులు అన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హమీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ)ను కొనసాగించాలని తెలిపారు. దీనికోసం దేశవ్యాప్త ఆందోళన చేపడతామని ఆయన కేంద్రాన్ని హెచ్చరించారు. శనివారం ఏపీలోని విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కూడా ఈ సమావేశంలో ఉన్నారు. గతంలో ఉన్న ఉపాధిహామీ చట్టాన్ని రద్దుచేసి కొత్తగా జీ రాం జీ పథకాన్ని తీసుకొచ్చారనీ, దీనిలో కార్మికులకుగానీ, రాష్ట్రాలకుగానీ ఎటువంటి హక్కులూ లేవని అన్నారు. ఉన్న హక్కులు కూడా పాక్షికంగానే ఉన్నాయని తెలిపారు. గతంలో కనీసం 100 రోజులు పని పేరుతో 50 రోజులన్నా కార్మికులకు ఉపాధి లభించేదని, ఇప్పుడు కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఉండేలా చేశారని అన్నారు. ఉపాధి హామీ పథకం వ్యవసాయ పనులకు ఆటంకమని చెబుతున్నారని, అలాంటిదేమీ లేదని అనేక నివేదికలు, పరిశోధనలు బయటపెట్టాయని తెలిపారు. కూలీరేట్లు పెరిగాయని చెబుతున్నారని, ఆచరణలో కూలీరేట్లు, వేతనాలు తగ్గాయని పేర్కొన్నారు.

గ్రామీణ పేదలు, వ్యవసాయ కార్మికుల శ్రమను కార్పొరేట్లు దోచుకునేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని విమర్శించారు. పథకంలో నిధులు గతంలో కేంద్రానికి 90 శాతం రాష్ట్రానికి 10 శాతం వాటా ఉండేదని, ప్రస్తుతం 60:40గా మార్చారని తెలిపారు. ఆకలిచావులు, వలసలు నివారించేందుకు ఉపయోగపడిన ఈ చట్టాన్ని రద్దు చేయడంతో ఆకలిచావులు పెరిగే ప్రమాదం ఉందని అన్నారు. పైగా దీనికి నిధుల కేటాయింపు డిమాండును బట్టి కాకుండా రాజకీయ అవసరాలకు తగిన విధంగా కేటాయించేలా నిబంధనలు రూపొందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేంద్రం ముందుగానే నిధులు ఇచ్చేదని, ఇప్పుడు పనిచేసిన తర్వాత ఇచ్చేలా పథకాన్ని రూపొందించారని తెలిపారు. ఉపాధి కల్పనలో ఆలస్యమయితే గతంలో కేంద్రమే పెనాల్టీ చెల్లించేదనీ, ఇప్పుడు ఆ బాధ్యతను రాష్ట్రం మీదకు నెట్టేశారని చెప్పారు. దీనిపై రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ మాట్లాడటం లేదని, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా గట్టిగా ప్రశ్నించడం లేదని అన్నారు. రెండు పార్టీలూ మోడీని చూసి భయపడుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న మూడు పార్టీలు మోడీతో అనుసరిస్తున్న తీరువల్ల రాష్ట్రానికి తీవ్రనష్టం వాటిల్లుతుందని తెలిపారు.

వీబీ జీ రామ్‌ జీతో దళితులు, బలహీనవర్గాలకు తీవ్రనష్టం
ఉపాధిహామీ చట్టం స్థానంలో వీబీ జీ రామ్‌ జీ బిల్లు తీసుకురావడం సరికాదని, దీనిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు సూచించారు. రాష్ట్రంలో వ్యవసాయ కార్మికులు, పేదలు, గ్రామీణ కూలీలు ఎక్కువమంది ఉన్నారని, ఈ బిల్లుతో వారందరికీ ఉపాధి పోతుందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -