ఏఐ వినియోగంతో ఎరువుల వాడకాన్ని తగ్గించాలి
తెలంగాణ రాష్ట్రం మరో పంజాబ్ కాకూడదు
సమీక్షా సమావేశంలో మంత్రి తుమ్మల
నేలలో పోషకాల లభ్యతను శాటిలైట్ డేటాతో గుర్తించవచ్చు : జర్మనీ ప్రతినిధులు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
‘డిజిటల్ అగ్రికల్చర్’తో తెలంగాణ వ్యవసాయంలో నూతన ఒరవడి తేవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. పర్యావరణానికి మేలు చేసేలా స్మార్ట్ వ్యవసాయం చేయాలని కోరారు. శుక్రవారం హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జర్మనీ ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రతినిధులు ‘డిజిటల్ అగ్రికల్చర్ తెలంగాణ రోడ్మ్యాప్’ పత్రాన్ని మంత్రికి వారు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ‘ఏఐ, ఎల్వోటీ ఆధారిత వ్యవసాయ సేవలతో ఎరువులు, పురుగుమందుల వినియోగా న్ని తగ్గించాలి. పంజాబ్లా మరో క్యాన్సర్ రాష్ట్రంగా మన తెలంగాణ మారకూడదు. నేల ఆరోగ్యాన్ని కాపాడటం, రైతు ఆదాయాన్ని పెంచడం, పర్యావరణానికి అనుకూలమైన వ్యవసాయమే మన లక్ష్యంగా ఉండాలి’ అని సూచించారు. జర్మనీ-భారత్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ప్రపంచంలోని తొలి ఐటీయూ ప్రామాణిత డిజిటల్ వ్యవసాయ యూజ్కేస్ను వేములవాడలో విజయవంతంగా అమలు చేసినట్టు జర్మనీ ప్రతినిధులు వివరించారు. ఉపగ్రహ, డ్రోన్, సెన్సర్ ఆధారిత ఈ మోడల్ ద్వారా నేలలోని ఎన్పీకే సూక్ష్మ పోషకాల లభ్యత విశ్లేషణ చేసి, అవసరమైన ఎరువుల పరిమాణాన్ని మాత్రమే సిఫారసులు చేస్తున్నామన్నారు.
ఏఐ ఆధారిత పంటల గుర్తింపు మోడల్, ఉపగ్రహ డేటాతో సబ్సిడీలు, బీమా, రుణాల పారదర్శక పంపిణీ వంటి అంశాలను కూడా మంత్రికి వివరించారు. సమగ్ర డిజిటల్ వ్యవసాయ ప్లాట్ ఫార్మ్ను రూపొందించి, రైతులు, పరిశోధకులు, విద్యార్థులందరూ ఉపయోగిం చుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ గోపి, డాక్టర్ రఘు చాలిగంటి, డాక్టర్ సెబాస్టియన్ బోసె, యాన్-క్రిస్టియన్ రెడ్లిచ్, పీజేటీఎస్ఏయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జానయ్య, టూరిజం కార్పొరేషన్ చైర్మెన్ పటేల్ రమేశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డిజిటల్ అగ్రికల్చర్తో నూతన ఒరవడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES