కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
త్వరలో తెలంగాణ ప్రజలకు సేవ చేసే పార్టీని పెట్టబోతున్నట్టు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. గురువారం మెట్ల మార్గం ద్వారా తిరుమలకు కాలినడకన వెళ్లే ముందు ఆమె మీడియాతో మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రతిపక్షాలుగా విఫలం కావడంతో ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ప్రత్యామ్నాయం లేకనే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఎక్కువ సీట్లు వచ్చాయన్నారు. తెలంగాణ ప్రాంత పరిరక్షణ, అస్తిత్వం, హక్కుల కోసం పోరాటానికే పార్టీ పెడుతున్నట్టు తెలిపారు. తన నిజాయితీ, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కేసును కోర్టు సంపూర్ణంగా కొట్టివేసిందన్నారు.
త్వరలో పార్టీ పెట్టబోతున్న నేపథ్యంలో స్వామి ఆశీస్సులు తీసుకుంటున్నట్టు తెలిపారు. కాలినడకన స్వామిని దర్శించుకునే మొక్కు తీర్చుకోవటానికి తిరుమల వచ్చినట్టు చెప్పారు. టీటీడీ విషయంలో భక్తులకు విశ్వాసం కలిగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఆంధ్రా ప్రాంతంలోని ఆదినారాయణ, ప్రతాప్, కిషోర్ యాదవ్ తదితరులు జాగృతికి మద్దతు ఇస్తున్నట్టు కవిత తెలిపారు. ఆంధ్ర ఆధిపత్యం, ఆంధ్రా రాజకీయ నాయకుల ఆధిపత్యాన్ని మాత్రమే తాము వ్యతిరేకించామనీ, ఆంధ్రా ప్రజలంటే తమకు ఎప్పుడూ ద్వేషం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రాలుగా మాత్రమే విడిపోయామనీ, ప్రజలుగా కలిసి ఉందామనే ఎప్పుడూ చెబుతున్నామన్నారు.
త్వరలో తెలంగాణ ప్రజలకు సేవ చేసే పార్టీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



