దళిత క్రైస్తవుల ఎస్సీ రిజర్వేషన్ సాధన సమితి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దళిత క్రైస్తవులకు ప్రత్యేకంగా ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని పలువురు నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్లోని సోమాజీగూడలో దళిత క్రైస్తవుల ఎస్సీ రిజర్వేషన్ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నాగళ్ల పోచయ్య ఇశ్రాయేల్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బిషప్ సామ్యేల్, ఇండియన్ క్రిస్టియన్ సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర కన్వీనర్ ఆండ్య్రూ జేవియర్, నాయకులు మోజెస్, భరోసా పార్టీ అధ్యక్షులు చింతల యేసయ్య, సాధన సమితి నాయకులు ఎం.వి.జాన్సన్, డాక్టర్ ఎ.జైపాల్ పాల్గొన్నారు. సమావేశంలో రాష్ట్రంలో దళిత క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలపై వారు చర్చించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలు కోసం పోరాడాలని నిర్ణయించారు. ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ తో పాటు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటుతోనే న్యాయం జరుగుతుందన్నారు. ఎస్సీ, బీసీ, క్రిస్టియన్ కార్పొరేషన్లు ఉన్నప్పటికీ దళిత క్రైస్తవులకు అన్యాయమే జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.



