సీఎంకు గ్రూప్-1 ఆఫీసర్ల విజ్ఞప్తి
ఐఏఎస్ల కమిటీ నివేదిక తెప్పించుకోవాలి: చంద్రశేఖర్గౌడ్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్రంలో అనుభవం గల గ్రూప్-1 అధికారులతో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డిని గ్రూప్-1 ఆఫీసర్ల అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మామిండ్ల చంద్రశేఖర్గౌడ్ , ప్రధానకార్యదర్శి హన్మంత్ నాయక్ ఇతర అధికారులతో కలిసి ముఖ్యమంత్రిని కలిశారు. ఆ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లుగా అనుభవం గల పంచాయత్రాజ్, మున్సిపల్ శాఖల గ్రూప్-1 అధికారులను నియమించాలని కోరారు. పరిపాలనా అనుభవంగల సీనియర్ గ్రూప్-1 అధికారులను కార్పొరేషన్ ఎండీలుగా, డైరెక్టర్లుగా కూడా నియమిస్తే సత్ఫలితాలు వస్తాయని అభిప్రాయపడ్డారు.
2015లో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటుపై ఆరుగురు ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటి వరకు ఆ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించలేదని తెలిపారు. వెంటనే ఆ కమిటీని నుంచి నివేదిక తెప్పించుకోవాలని సూచించారు. స్టేట్ సివిల్ సర్వీస్ పరిధిలోకి అన్ని గ్రూప్-1 పోస్టులను తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సానుకూలంగా స్పందించి అతి త్వరలో గ్రూప్-1 అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. సీఎంను కలిసిన వారిలో గ్రూప్-1 ఆఫీసర్ల అసోసియేషన్ అధ్యక్షులు మామిండ్ల చంద్రశేఖర్గౌడ్, ప్రధాన కార్యదర్శి హన్మంత్నాయక్తోపాటు శశికిరణాచారి, అరవింద్రెడ్డి, నూతనకంటి వెంకట్, పద్మావతి, భరత్రెడ్డి, ప్రశాంతి, మాధవ్, ఫణి గోపాల్, వినోద్, సోమశేఖర్ తదితరులు ఉన్నారు.
తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



