బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట 11మంది మృతి.. 47మందికి గాయాలు
ఐపీఎల్ విజేత ఆర్సీబీ అభినందన సభలో ఘటన
అభిమాన ఆటగాళ్ళను చూసేందుకు పోటెత్తిన జనాలు
విషాదాన్ని ఊహించలేదు : కర్నాటక సీఎం సిద్ధరామయ్య
ప్రధాని మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్ సహా పలువురి విచారం
స్టేడియం కెపాసిటీ 30వేలు, వచ్చింది రెండు లక్షల మందికి పైనే
ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశం
మృతుల కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్గ్రేషియా
బెంగళూరు : విజయోత్సవ సభ కాస్తా విషాదంగా మారింది. 18 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ మంగళవారం జరిగిన ఐపీఎల్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజయం సాధించిన నేపథ్యంలో ఆ బృందాన్ని సన్మానించడానికి కర్నాటకలోని బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ సన్మాన కార్యక్రమానికి వచ్చే తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు వేలాదిగా అభిమానులు, ప్రజలు స్టేడియానికి పోటెత్తారు. స్టేడియం గేట్లు తెరవగానే ఒక్కసారిగా లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో తోపులాట మొదలైంది. జనాన్ని అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జి కూడా చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇది తొక్కిసలాటకు దారి తీసింది. ఈ విషాద ఘటనలో ఆరేండ్ల బాలికతో సహా 11మంది మృతి చెందగా, 47మంది గాయపడ్డారని అధికారులు చెప్పారు. కాగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భయపడుతున్నారు.తొక్కిసలాట జరిగిన ప్రాంతం వద్ద హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. చెప్పులు చెల్లాచెదురుగా పడివున్నాయి. తొలుత విధానసౌధలో కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డి.కె.శివకుమార్లు క్రీడాకారుల బృందాన్ని సన్మానించారు. అక్కడి నుంచి వారు స్టేడియానికి రావాల్సి ఉంది. ఈలోగానే ఈ విషాదం సంభవించింది. తొక్కిసలాట కారణంగా క్రీడాకారుల సన్మాన కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. స్టేడియంవైపు వెళ్ళే మెట్రోలు, ఇతర వాహనాలను కూడా ఆపేశారు.
ఈ విషాదాన్ని ఊహించలేదు : సీఎం సిద్ధరామయ్య
రూ.10లక్షల ఎక్స్గ్రేషియా
ఇంతటి విజయోత్సవ సమయంలో ఇలాంటి విషాదాన్ని అస్సలు ఊహించలేదని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. విధానసౌధ వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ అంచనాలకు మించి జనాలు స్టేడియానికి పోటెత్తారని అన్నారు. విధానసౌధకు వెలుపల దాదాపు లక్ష మంది ఆర్సీబీ ఫ్యాన్స్ గుమిగూడారని తెలిపారు. కానీ అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగలేదన్నారు. ”చిన్నస్వామి స్టేడియంలో దాదాపుగా 30వేలమంది పడతారు, కానీ గేట్ల వద్ద దాదాపు రెండు మూడు లక్షలమంది ఉన్నారు. తోపులాట ఉంటుందని ఊహించాం. రాత్రే ఫైనల్ మ్యాచ్ జరిగింది, ఉదయానికి మేం సన్నద్ధం కావాల్సి వచ్చింది. కాకపోతే ఇంత జనాన్ని ఊహించలేదు” అని ముఖ్యమంత్రి చెప్పారు. అయినా చేయగలిగినంతవరకూ ఏర్పాట్లు చేశామన్నారు. మృతి చెందిన వారిలో ఎక్కువమంది యువతేనని ఆయన విచారం వ్యక్తం చేశారు.
బీజేపీ రాజకీయాలు చేస్తోంది
ఈ ఘటన విషయంలో బీజేపీ తీరును సిద్ధరామయ్య తప్పుబట్టారు. అనూహ్యంగా వచ్చిన జనం కారణంగా ఈ సంఘటన జరిగినా.. ప్రతిపక్ష బీజేపీ దీనిపై రాజకీయాలు చేస్తోందనీ, కానీ తాను అలా చేయాలనుకోవడం లేదని సీఎం అన్నారు. భద్రతా యంత్రాంగం వైఫల్యమా లేక మరేదైనా ఉందా అనే విషయం తేల్చుకునేందుకు మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించినట్టు చెప్పారు. 15రోజుల్లో నివేదిక వస్తుందని ఆయన అన్నారు. ఈ తొక్కిసలాటలో మరణించినవారి కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించింది. గాయపడిన వారికి ఉచిత చికిత్సనందిస్తామని తెలిపింది.
పోలీసులను నిందించొద్దు : డిప్యూటీ సీఎం
తొక్కిలాటపై పోలీసులను తప్పు పట్టవద్దని డిప్యూటీ సీఎం డి.కె శివకుమార్ అన్నారు. ”పరిస్థితిని చూసి దానికి తగినట్టుగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ప్రణాళికలను కూడా మార్చాం. చేయగలిగినదంతా చేశాం. అయినా, ఆ జనాన్ని నియంత్రించడం ఎవరి వల్లా కాలేదు. ఇందుకు పోలీసులను నిందించరాదు” అని ఆయన చెప్పారు.
వ్యవధి లేదు
మంగళవార రాత్రే ఫైనల్ మ్యాచ్ జరగటం.. ఆ తర్వాత రోజే ఈ వేడుకలను నిర్వహించటంపై అందరిలోనూ ప్రశ్నలను కలగజేస్తున్నాయి. ఈ వేడుకలను తర్వాత నిర్వహించి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదనీ, ఇంత తక్కువ వ్యవధిలో ఎందుకు నిర్వహించారని అంతా అనుకుంటున్నారు. అయితే, ఆర్సీబీ తరఫున ఆడిన క్రీడాకారుల్లో చాలామంది ఈ రాత్రికే దేశాన్ని వీడాల్సి ఉన్నది. వారికి ఉన్న ఇతర కార్యక్రమాల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ సన్మాన సభను ఇంత తక్కువ వ్యవధిలో ఏర్పాటు చేయాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి నసీర్ అహ్మద్ చెప్పారు.
ప్రధాని, రాహుల్, ఖర్గే ప్రభృతుల ఖండన
తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలియచేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ విషాద సమయంలో తన మనస్సు బెంగళూరులోనే ఉందన్నారు. కేంద్రరక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్రం ఆందోళనను వ్యక్తం చేశారు.
మనిషి జీవితం కంటే ఏ వేడుక కూడా ఎక్కువ కాదని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. హృదయవిదారకంగా మారిన పరిస్థితుల పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు అవసరమైన సాయాన్ని కర్నాటక ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఈ ఘటనపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. గాయపడి, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంలు పరామర్శించారు. కర్నాటక గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలన్నారు. మాజీ సీఎం, ఎంపీ బసవరాజు బొమ్మై ఈ ఘటనపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. సరైన ప్రణాళిక లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందనీ, ఇందుకు ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలని కేంద్ర మంత్రి హెచ్.డి.కుమారస్వామి డిమాండ్ చేశారు.
బాధితులకు రూ. 5లక్షలు
తొక్కిసలాట ఘటనపై కర్నాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్పందించింది. దీనిపై విచారాన్ని వ్యక్తం చేసింది. మరణించినవారి కుటుంబాలకు రూ.5లక్షలు అందచేస్తామని ప్రకటించింది.
విషాదంగా మారిన విజయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES