రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచే కార్యక్రమం
రికార్డ్ స్థాయిలో డిమాండ్ పెరిగినా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా
రాష్ట్ర అభివృద్ధిలో విద్యుత్ శాఖ అగ్రస్థానంలో ఉండాలి : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర, దేశ ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న 51,868 మంది విద్యుత్ ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా పథకం రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచే కార్యక్రమమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం హైదరాబా ద్లోని ప్రజాభవన్లో విద్యుత్ ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమాపై బ్యాంకర్లతో ఒప్పందం చేసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో భట్టి ప్రసంగించారు. రాష్ట్ర ప్రజల కోసం పనిచేసే ప్రధాన సంస్థల్లో ఒకటైన విద్యుత్ సంస్థ సిబ్బంది, కుటుంబాల కోసం ప్రమాద బీమా పథకం తీసుకురావడం వ్యక్తిగతంగా తనకు తప్తినిచ్చిందని తెలిపారు. విద్యుత్ శాఖ ఉద్యోగులు ప్రాణాలు అడ్డుపెట్టి విధులు నిర్వహిస్తారని కొనియాడారు. రాష్ట్ర జీడీపీ పెరుగుదలకు ఈ శాఖ ఇంధనంగా ఉపయోగపడుతున్నదన్నారు.
ఉద్యోగుల హౌదాలు వేరైనా వారి కుటుంబాల విషయంలో మాత్రం ఒకే రకమైన అనుబంధం, బాధ్యత ఉంటాయని గుర్తుచేశా రు. ఇంటిపెద్దకు ఏదైనా ప్రమాదం జరిగితే ఆయా కుటుంబాలు తలకిందులవుతాయనీ, అలాంటి పరిస్థితి రావద్దని ఆకాంక్షించారు. అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబాలను ఆదుకునేందుకే ఈ ప్రమాద బీమా పథకానికి శ్రీకారం చుట్టామని డిప్యూటీ సీఎం వివరించారు. ఈ పథకంలో సిబ్బంది కాంట్రిబ్యూషన్ లేదనీ, దీంతో ఉద్యోగుల్లో మనోధైర్యం పెరిగి, ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగుల సంక్షేమ బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా తెరిచిన ఉద్యోగులకు కేవలం ప్రమాద బీమానే కాకుండా వివాహం, విద్యాపరమైన ఆర్థిక సహాయంలోనూ ఆ బ్యాంకు రుణాలు అందించి చేయూతనివ్వనుందని వెల్లడించారు. ప్రమాదవశాత్తు శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి రూ.80 లక్షల పరిహారం అందుతుందని తెలిపారు. ఈ ఖాతా తెరిచిన ఉద్యోగుల అకౌంట్లో జీరో బ్యాలెన్స్ ఉన్నప్పటికీ సేవలు వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు. ఏటీఎం కార్డు, చెక్బుక్ సేవలపై ఎటువంటి చార్జీలు ఉండవని స్పష్టం చేశారు. సహజ మరణం చెందితే రూ.10 లక్షల వరకు ప్రమాద బీమా ఉంటుందనీ, ఉద్యోగితో పాటు నలుగురు కుటుంబ సభ్యులకు కలిపి రూ. 20 లక్షల వరకు బీమా సౌకర్యం వర్తిస్తుందని తెలిపారు. గతంలో తాను జాతీయ బ్యాంకు డైరెక్టర్గా విధులు నిర్వహించానని భట్టి గుర్తుచేశారు. ఎడ్యుకేషన్ లోన్ ఇచ్చేందుకు నిబంధనలను సరళీకరిస్తూ, అర్బన్ ప్రాపర్టీ, నెలవారి జీతం లేకున్నా ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వాలని బోర్డులో తీర్మానం పెట్టి తాను ఆమోదింపజేసినట్టు తెలిపారు. నాటి ప్రతిపాదనల మూలంగా డాక్టర్ పట్టాభి ఎడ్యుకేషన్ లోన్, డాక్టర్ పట్టాభి కిసాన్ క్రెడిట్ కార్డు వంటి పథకాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. విద్యుత్ ఉద్యోగుల కోసం తెస్తున్న ప్రమాద బీమా పథకం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వానికి తృప్తినిచ్చే కార్యక్రమమని అన్నారు. 2023తో పోలిస్తే 2025లో పీక్ డిమాండ్ 17,162 మెగావాట్లు వచ్చిందనీ, గతంతో పోలిస్తే 2,000 మెగావాట్ల డిమాండ్ అదనంగా పెరిగినా విద్యుత్ సరఫరాలో చిన్న అంతరాయం లేకుండా రాష్ట్ర విద్యుత్ సిబ్బంది చూసుకున్నారని ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు.
హైదరాబాద్కు పెట్టుబడుల రాక
రీజినల్ రింగ్ రోడ్డు, మూసీ పునర్జీవం, ఫ్యూచర్ సిటీ ఇలా రకరకాల ప్రాజెక్టులు రాష్ట్రంలో ప్రారంభమై నట్టు భట్టి వెల్లడించారు. రీజినల్ రింగ్ రోడ్డుతో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే వివిధ క్లస్టర్లతో ప్రపంచ నలుమూలల నుంచి పెట్టుబడి కోసం అంతా హైదరాబాద్కు తరలివస్తున్నారని తెలిపారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని విద్యుత్ ఉత్పత్తి పెంచడంతోపాటు కాలుష్య రహిత గ్రీన్ ఎనర్జీని సమకూర్చు కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో పని చేస్తున్నదని వివరించారు. గత పది సంవత్సరాలు ప్రత్యేక విద్యుత్ పాలసీ లేకపోవడంతో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మనం వెనుకబడిపోయామని వివరించారు. ఈ లోటును గుర్తించి ప్రభుత్వం ఏర్పడగానే 2025 న్యూ గ్రీన్ ఎనర్జీ పాలసీని తీసుకువచ్చామని గుర్తుచేశారు. 2030 నాటికి 20వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్నదని చెప్పారు. ఒకవైపు ఉత్పత్తి పెంచుకుంటూనే సరఫరాలో 75 శాతం లక్ష్యాన్ని చేరుకోగానే సరఫరా వ్యవస్థను అప్డేట్ చేసుకుంటూ ముందుకు పోతున్నామని చెప్పారు. అందుకే అదనంగా రెండు వేల మెగావాట్ల పీక్ డిమాండ్ వచ్చినా రాష్ట్రంలో రెప్పపాటు అంతరాయం లేకుండా ఈ వేసవిలో విద్యుత్ సరఫరా జరిగిందని డిప్యూటీ సీఎం వివరించారు. ఈ కార్యక్రమంలో ఇంధన శాఖ సీఎం డి సందీప్ కుమార్ సుల్తానియా, ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES