నలుగురు పోలీసులకు గాయాలు
నల్లగొండ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స
నవతెలంగాణ -దేవరకొండ
సీఎం రేవంత్ రెడ్డి బందోబస్తుకు వెళ్లి తిరిగి వస్తుండగా నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం జువ్విగూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్కు తీవ్ర గాయాలయ్యాయి. సోమవారం నారాయణపేట జిల్లా మక్తల్లో జరిగిన సీఎం పర్యటన సందర్భంగా నల్లగొండ జిల్లా నుంచి పోలీసులు బందోబస్తుకు వెళ్లారు. అనంతరం తిరిగి నల్లగొండకు వస్తుండగా మంగళవారం ఉదయం జువ్విగూడెం వద్ద కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. దీంతో వాహనంలో ఉన్న ఏఎస్ఐలు శ్రీధర్, నరసింహారెడ్డి, సత్యనారాయణ, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లుకు గాయాలయ్యాయి. వారిని వెంటనే నలగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే ఎస్పీ శరత్ చంద్రపవార్ ప్రభుత్వాస్పత్రికి వెళ్లి వారిని పరామర్శించారు. తమ సిబ్బందికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు.



