నవతెలంగాణ-హైదరాబాద్: మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లాలో జరిగిన యాసిడ్ దాడి ఘటనపై గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ బుధవారం రాస్తారోకో నిర్వహించారు. వివరాల ప్రకారం.. 13 ఏళ్ల మైనర్ బాలిక పాఠశాల నుండి ఇంటికి తిరిగి వస్తుండగా, మంగళవారం ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 12.30గంటల మధ్య గ్రామ శివార్లలోని పొలాల సమీపంలో నిందితుడు యాసిడ్తో దాడి చేశాడు. అనంతరం నిందితుడు పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన బాలికను వెంటనే చికిత్స కోసం లోనిలోని ప్రవర మెడికల్ ట్రస్ట్ ఆస్పత్రికి తరలించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నిందితుడిపై బిఎన్ఎస్లోని సెక్షన్ 124(యాసిడితో స్వచ్ఛందంగా తీవ్రమైన గాయం కలిగించడం), 126 (అక్రమ నిర్బంధం) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
రాష్ట్రంలో నిర్వహిస్తున్న శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు చర్చకు డిమాండ్ చేశాయి. నిందితులు పోలీసులకు భయపడటం లేదనేందుకు ఈ దాడి ప్రత్యక్ష ఉదాహరణ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ్ వడెట్టివార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో ఫడ్నవీస్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.



