Friday, June 6, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅంగన్‌వాడీ కేంద్రాల్లో 25 శాతం అడ్మిషన్లు పెంచాలి

అంగన్‌వాడీ కేంద్రాల్లో 25 శాతం అడ్మిషన్లు పెంచాలి

- Advertisement -

– స్కూళ్లలో మాదిరిగా అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ బెల్స్‌ మోగించాలి
– త్వరలో 14వేల అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేస్తాం
– వారికి రిటైర్డ్‌ బెనిఫిట్స్‌ ఇస్తున్నాం…ప్రమోషన్లు కల్పించాం : మహిళా శిశు సంక్షేమ శాఖ
– మేధో మథన సదస్సులో మంత్రి డాక్టర్‌ సీతక్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

అంగన్‌వాడీ కేంద్రాల్లో 25 శాతం అడ్మిషన్లు పెంచేలా ప్రతి అంగన్‌వాడీ టీచర్‌, హెల్పర్‌ కృషి చేయాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ ధనసరి అనసూయ(సీతక్క) పిలుపునిచ్చారు. త్వరలో 14 వేల అంగన్‌వాడీ సిబ్బంది పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే మినీ అంగన్‌వాడీలకు ప్రధాన టీచర్లుగా ప్రమోషన్లు కల్పించామనీ, రిటైర్డ్‌ బెనిఫిట్స్‌ ప్రకటించామని గుర్తుచేశారు. జీపీ సిబ్బందికి మాదిరిగానే అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల జీతాలను గ్రీన్‌ ఛానల్‌లో అందించేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు. బుధవారం రాజేంద్రనగర్‌లోని తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మేదో మథన సదస్సు- 2025 నిర్వహించారు. అందులో ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి సీతక్క పరిశీలించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల అభ్యాసం కోసం వినూత్నంగా రూపొందించిన టీచింగ్‌ మెటీరియల్‌ స్టాల్‌ను పరిశీలించి అభినందించారు. మహిళా సంఘాల ద్వారా మెటీరియల్‌ను రూపొందించి ప్రతి అంగన్‌వాడీ కేంద్రానికి పంపిణీ చేస్తామని హామీనిచ్చారు. అంగన్వాడీ చిన్నారులకు పంపిణీ చేసే స్నాక్స్‌, బాలామృతాన్ని రుచిచూశారు. బాలామృతాన్ని ప్యాకెట్లలలో కాకుండా బాక్సుల్లో ఇవ్వాలని ఆదేశించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆదిలాబాద్‌ జిల్లా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్‌లోని ఆదివాసీల ఆహారాన్ని ఇష్టంగా తిన్నారు. మంత్రి వెంట టీజీ ఫుడ్స్‌ చైర్మెన్‌ ఎంఏ ఫహీం, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్‌, డైరెక్టర్‌ కాంతి వెస్లీ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రీస్కూల్‌ వీడియోను విడుదల చేశారు. అనంతరం సదస్సులో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. స్కూళ్లలో మాదిరిగానే అంగన్‌వాడీ కేంద్రాల్లో బెల్‌ కొట్టాలని సూచించారు. దాని ద్వారా చిన్నారుల్లో క్రమశిక్షణ, ఉత్సాహం పెరుగుతాయనీ, సిబ్బంది సకాలంలో డ్యూటీకి వచ్చేందుకు దోహదపడుతుందని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో అందిస్తున్న విద్య, ఆరోగ్య భద్రతను మెరుగుపరుచుకునే లక్ష్యంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. వాటిని అక్షర జ్ఞానానికి, పోషకాహారానికి, ఆరోగ్యానికి, ఆటవిడుపునకు వికాస కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ప్లేస్కూళ్లకు దీటుగా అంగన్‌వాడీలను తీర్చిద్ది తల్లిదండ్రులపై భారాన్ని తగ్గిస్తామని హామీనిచ్చారు. చిన్నారుల చదువు, సౌకర్యం, ఆటవిడుపు కోసం 57 రకాల వస్తువులను అంగన్‌వాడీలకు సరఫరా చేస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులకు నమ్మకం కలిగించేలా సిబ్బంది పనిచేయాలని సూచించారు. లబ్దిదారులకు అందిస్తున్న కోడిగుడ్ల విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలు కూర్చునేందుకు వీలుగా బెంచీలను సరఫరా చేస్తామని ప్రకటించారు. అంగన్‌వాడీ టీచర్లకు అధునాతమైన మొబైల్‌ ఫోన్లను అందిస్తామని హామీనిచ్చారు. చిన్నారులకు మరింత పౌష్టికారాన్ని అందించడంలో భాగంగా వారానికి రెండు సార్లు ఎగ్‌ బిర్యానీ వడ్డించేలా మెనూ మారుస్తామని తెలిపారు. ఇందిరమ్మ అమృతం పథకం ద్వారా కౌమార బాలికలకు పోషకాలతో కూడిన చిక్కీలను పంపిణీ చేస్తున్నామన్నారు. బాల్య వివాహాలను పూర్తిస్థాయిలో అరికట్టేలా మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది పని చేయాలని ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -