నవతెలంగాణ-హైదరాబాద్: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఇవాళ (జూలై 21న) ఉదయం ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షాల కారణంగా ఎయిరిండియా ఫ్లైట్ (AI 2744) రన్వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా అదుపుతప్పి పక్కకు జరిగిపోయింది. ఈ విమానం కొచ్చిన్ నుంచి ముంబై వస్తుండగా ఈ ఘటన జరిగింది.
అయితే, రన్వే నెంబర్ 27పై ల్యాండింగ్ అవుతున్న సమయంలో వర్షం కారణంగా రన్వే తడిగా ఉండటంతో విమానం సడెన్గా పక్కకు జరిగింది. అప్రమత్తమైన పైలట్.. విమానాన్ని నియంత్రించాడు. దీంతో ప్రయాణికులందరూ ఊపిరి ఒక్కసారిగా పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. విమానానికి ఏమైనా డ్యామేజ్ అయిందా?.. ఇంజిన్ లేదా టెక్నికల్ లోపాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో తనిఖీ చేస్తున్నారు.
ముంబయిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం రాత్రి కురిసన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు కూడా నీటమునిగినట్లు నగర అధికారులు తెలిపారు. ముంబై పశ్చిమ ప్రాంతంలోని అంధేరీ సబ్ వేలో నీరు నిలిచిపోవడం వల్ల రోడ్డును బ్లాక్ చేశారు. దీంతో వాహనదారులు ఇబ్బందులెదుర్కొంటున్నారు. కాగా, రాబోయే 24 గంటల్లో.. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.