నవతెలంగాణ-హైదరాబాద్ మాలిలో ముగ్గురు భారతీయులు కిడ్నాప్కు గురయ్యారు. ఓ సిమెంటు ఫ్యాక్టరీపై సాయుధ దుండగులు దాడి చేసిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. నిషేధిత ఉగ్రవాద సంస్థ అల్ఖైదాతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ గురువారం ధ్రువీకరించింది
పశ్చిమ మాలిలోని కాయెస్ ప్రాంతంలోని డైమెండ్ సిమెంటు ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈనెల 1న ఈ ప్రాంతంలో సాయుధ దుండగులు దాడి చేసి.. అక్కడి కార్మికులను బందీలుగా తీసుకెళ్లారు. వారిలో భారత్కు చెందిన ముగ్గురు కార్మికులు ఉన్నారు. అల్ఖైదా అనుబంధ సంస్థ జమాత్ నుస్రత్ అల్ ఇస్లాం వాల్ ముస్లిమిన్ ఈ దాడిని తామే చేశామని ప్రకటించింది. కిడ్నాప్కు గురయిన వారి వివరాలను విదేశాంగశాఖ వెల్లడించలేదు. మాలి రాజధాని బమాకోలోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులు, పరిశ్రమ యాజమాన్యంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతుందని విదేశాంగశాఖ తెలిపింది. బాధిత కుటుంబాలతో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నిస్తున్నారని వెల్లడించింది.
కాగా.. ఈ ఘటనను భారత్ తీవ్రంగా ఖండించింది. బందీలను సురక్షితంగా, త్వరగా విడుదల చేయడానికి మాలీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈసందర్భంగా మాలిలోని భారతీయ పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. సాయం కోసం మన రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది.