నవతెలంగాణ-కంఠేశ్వర్
పాఠశాల జీవితం నుంచి బయట ప్రపంచానికి పదవ తరగతి విద్యార్థులు చదువుతోపాటు ఉత్తమమైన సంస్కారంతో ముందుకు సాగాలని నిజామాబాద్ రూరల్ మండల విద్యాశాఖ అధికారి సేవుల అన్నారు. బుధవారం సారంగాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. బాల్యంలో ఉపాధ్యాయుల బోధన నుండి వ్యక్తిత్వాన్ని నిర్మించుకున్న విద్యార్థులు భవిష్యత్తులో రాణిస్తారని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ పోశన్న మాట్లాడుతూ క్రమశిక్షణ, నిరంతర శ్రమ విజయ సోపానాలు అవుతాయని, సానుకూల దృక్పథంతో జీవితంలో ముందుకు సాగాలని ఆయన విద్యార్థులకు ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కే లలిత, డాక్టర్ సల్ల సత్యనారాయణ, గోపాల్, మొహమ్మద్ జావిద్, విద్యాసాగర్, డాక్టర్ గంగాధర్, ఘనపురం దేవేందర్, స్వరూప, ఏ లలిత, శ్రీలత, సుజాత, సునంద, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.



