పర్యావరణ పరిరక్షణ, కృత్రిమ మేధ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన సద్వినియోగం, ఉపాధి పరిరక్షణ వంటి మానవాళి మౌలిక సమస్యలపై సునిశితమైన దృష్టి పెట్టాల్సిన కీలక నేపధ్యంలో, గత నెలరోజులకు పైగా అమెరికా, ఇజ్రాయిల్ ఒక పక్క, మరోవైపు ఇరాన్ కొనసాగిస్తున్న అమానుష యుద్ధం ఫలితంగా ప్రపంచ దేశాలపై తీవ్రమైన దుష్ప్రభావం పడింది. ఎటువంటి యుద్ధంలోనైనా ఇరు పక్కల వినాశనం తప్ప, ఏ ఒక్కరికీ విజయం మాత్రం దక్కదని, పరాజితులు తప్ప, యుద్ధాల్లో చివరకు విజేతలెవరూ ఉండరని చరిత్రలో ఎన్నో సందర్భాల్లో స్పష్టంగా రుజువైంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న అహంకారపూరిత వైఖరి మాత్రమే ఈ యుద్ధానికి ముఖ్య కారణనమనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే పాలస్తీనాలోని ప్రాంతాలపై గత రెండేళ్లకు పైగా మారణ హోమం సాగిస్తున్న ఇజ్రాయిల్, అమెరికాకు వంతపాడుతూ ఈ యుద్ధంలో మరో భాగస్వామిగా ఉంది. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ (ఐ.సి.సి) ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును ఒక యుద్ధనేరస్తునిగా ఇప్పటికే ప్రకటించింది. ట్రంప్ వలలో చిక్కుకోకుండా అప్రమత్తంగా వ్యవహరించిన నాటో దేశాలను తప్పనిసరిగా అభినందించాలి. ఇరాన్పై తప్పుడు ఆరోపణలతో, అవివేకమైన అంచనాలతో యుద్ధబరిలోకి ఏకపక్షంగా దిగిన ట్రంప్ ఇప్పుడు దిక్కుతోచని సంకటస్థితితో సతమతమవుతున్నాడు. అసలు ఏ లక్ష్య సాధనకు యుద్ధం మొదలు పెట్టాడో అర్ధం కాని అయోమయస్థితికి ట్రంప్ నెట్టబడ్డాడు. చివరకు తన సొంత దేశమైన అమెరికా ప్రజల తీవ్ర ఆగ్రహానికి ఆయన గురయ్యాడు. మితిమీరిన ఆయన యుద్ధకాంక్షను అమెరికన్ కాంగ్రెస్ కూడా తప్పుపట్టింది. యుద్ధ ప్రభావాన్ని చర్చించిన బ్రిటిష్ పార్లమెంట్ కూడా మిత్ర దేశమైన అమెరికాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది.
ఐక్య రాజ్య సమితి చేసిన పలు తీర్మానాలను, అంతర్జాతీయ న్యాయ సూత్రాలను అమెరికా ఉల్లంఘింస్తోంది. అమెరికా, ఇజ్రా యిల్ యుద్ధాన్ని ప్రారంభిస్తే, యుద్ధాన్ని మాత్రం తామే ముగిస్తామని ఇరాన్ ధీమాగా చెబుతోంది. ఇరాన్పై ఆకస్మికంగా, అన్యాయంగా యుద్ధాన్ని ప్రారంభించిన ట్రంప్, గడియ గడియకో మాట చెబుతూ, రోజుకొక విధానం అనుసరిస్తున్నాడు. ఇరాన్ను మళ్లీ రాతి యుగంలోకి పంపిస్తామని బెదిరిస్తున్నాడు. ఇరాన్పై దాడి చేసి వందల మంది పిల్లలను చంపేయడం వర్ణించలేని కిరాతక చర్య. మొత్తం యుద్ధంలో ఇరుపక్షాల వైపు చమురు క్షేత్రాలు, మిలటరీ కేంద్రాలు, ఆసుపత్రులు, విద్యుత్ ప్లాంట్లు, పాఠశాలలు, వంతెనలు వంటి కీలక కేంద్రాలు ధ్వంసమవుతున్నాయి. ఇరాన్ శక్తియుక్తుల్ని తక్కువగా అంచనా వేయడమే ట్రంప్ అహంకారానికి, అనాలోచిత వైఖరికి నిదర్శనం. చరిత్ర ను విశ్లేషిస్తే, అమెరికా ఎటువంటి గుణపాఠాలు నేటికీ నేర్చుకోలేదని అర్ధమవుతోంది. గతంలో చిలీ, లిబియా, ఇరాక్ వంటి దేశాలకు సంబం ధించి అమె రికా అత్యంత దుర్మార్గంగా వ్యవహరించింది. వియత్నాం చేతుల్లో ఘోరంగా దెబ్బతింది. వెనిజువేలా అధ్యక్షుడు మదురోను అర్ధరాత్రి వేళ అక్రమ పద్ధతుల్లో కిడ్నాప్ చేసి ఆయన్ను బంధించి అమెరికాకు తరలించడం దేశాల సార్వభౌమాధికారంపై దాడి చేయడమే. అర్ధంపర్థం లేనివిధంగా పలు దేశాలపై ట్రంప్ భారీ సుంకాలు విధించడం కూడా ఆర్థిక అగ్రవాదమే. ఒక రకంగా అదీ యుద్ధమే.
మరోవైపు ఇరాన్ సమయస్ఫూర్తితో గల్ఫ్లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా ఎంచుకుని వాటిపై దాడి చేస్తోంది. సామ్రాజ్యవాద, దురహంకార పెత్తనం చెలాయించే అమెరికాకు ఇరాన్ రూపంలో తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. అసలు గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలు దీర్ఘకాలంగా ఉండటమే అమెరికా ఆధిపత్య ధోరణికి నిదర్శనం. తన రక్షణ వ్యాపారం కోసం, చమురు సంపద కోసం, పశ్చి మాసియాపై తన రాజకీయ, ఆర్ధిక పెత్తనం కోసం అమెరికా ఈ దుర్నీతికి అనేక ఏళ్లుగా పాల్పడు తోంది. ఫలితంగా పశ్చిమాసియాలో తీవ్ర అనిశ్చితి నెలకొంది. హర్మూజ్ జలసంధిని ఇప్పుడు ఇరాన్ మూసేసింది. ఫలితంగా భారత్తో సహా అన్ని దేశాలు చమురు కష్టాలు పడుతున్నాయి. చమురు బ్యారెల్ ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. అమెరికాతో సహా పలు దేశాలు తమ రక్షణ బడ్జెట్ను భారీగా పెంచేసాయి.
యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉండటంతో ప్రపంచ దేశాలకు పలు రకాల ఇబ్బందులు ఎదురయ్యాయి. పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమవుతున్నాయి. ద్రవ్యోల్బణం, ధరలు పెరిగాయి. ఎగుమ తులు, దిగుమతుల వ్యవస్థలు దెబ్బతిని వాణిజ్య రంగం కునారిల్లుతోంది. హర్మూజ్ జల సంధి ద్వారా జరిగే చమురు రవాణాకు తీవ్ర విఘాతం ఏర్పడింది. ఇరాన్తో భారత్ కున్న సాంప్రదాయక మితృత్వం వల్ల కొంతమేరకు ఉపశమనం లభించింది. అయితే రూపాయి విలువ రికార్డుస్థాయి పతనం, క్రూడాయిల్ ధరల పెరుగుదల, భారీ వాణిజ్య లోటు వంటి తీవ్ర సమస్యలను భారత్ ఎదుర్కుంటోంది. గల్ఫ్ దేశాల నుండి సుమారు నాలుగు లక్షల మంది భారత్కు తిరిగి వచ్చేసారు.
ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ యుద్ధాన్ని వెంటనే విరమించాలని అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ దేశాలకు గట్టిగానే చెప్పారు. కానీ ప్రపంచ శాంతి, దేశాల భద్రత కోసం ఆయన చేసిన సూచనలను పెడచెవిన పెట్టడం సహించరాని విషయం. వీటో అధికారం కల్గిన అమెరికా వంటి ఒక అగ్ర దేశం ఐక్య రాజ్య సమితి నిర్ణయాలను ఖాతరు చేయక పోవడం అనైతికం. అదే సందర్భంలో ‘ప్రతి దేశం తమ సొంత ప్రయోజనాల కన్నా, అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు కట్టుబడి ఉండటం ఎంతో మిన్న’ అంటూ స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్ ఇచ్చిన అపూర్వమైన సందేశం ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచింది. అంతే కాకుండా ఇజ్రాయిల్ నుండి తమ దేశ రాయబారిని వెనక్కు రప్పించి యుద్ధం పట్ల తీవ్ర వ్యతిరేకతను ఆయన గట్టిగా వ్యక్తం చేశారు.ఇప్పటికైనా తక్షణమే యుద్ధ విరమణ జరగాలి. అప్పుడే విపత్కర పరిస్థితుల నుండి భారత్తో సహా మొత్తం ప్రపంచ దేశాలు బయట పడతాయి. యుద్ధ విరమణ కోసం అన్ని దేశాలు తమ వంతు కృషి చేయాలి, అంతే కాదు బిగ్గరగా గళమెత్తాలి. తద్వారా ప్రపంచం యావత్తు అస్థిరతలో కూరుకుపోయే పెను ప్రమాదాన్ని నివారించాలి.
వి.వి.కే.సురేష్
9440345850



