అణు ఇంధన రంగంలో అమెరికన్ ప్రైవేటు పెట్టుబడులకు మార్గం సుగమం చేసేందుకు వీలుగా మోడీ ప్రభుత్వం మన చట్టాలను సవరించేందుకు సిద్ధపడుతున్నదని ఇండియన్ ఎక్స్ప్రెస్ (మే 19), తదితర వార్తా పత్రికలు వెల్లడించాయి. అణు ఇంధన ప్లాంట్ల నిర్మాణానికి అవసరమైన యంత్ర సాధనాల దిగుమతులతో పాటు ప్రతిపాదిత ప్లాంట్ల యాజమాన్య హక్కుల విషయమై కూడా చట్టాలలో మార్పులు తీసుకు రావడానికి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుందని వార్తా మాధ్యమాలు వివరించాయి. అణు ప్రమాదాలు సంభవిస్తే పౌర నష్టాలను భరించడానికి ఉద్దేశించిన 2010 నాటి చట్టం, అణు ఇంధన శక్తి చట్టం-1962లో సర్కారు వారు సవరణలు తీసుకు రానున్నారని ఆ వార్తా కథనాలు సూచిస్తున్నాయి. పార్లమెంట్ను ఉద్దేశించి నిర్మలా సీతారామన్ చేసిన బడ్జెట్ ప్రసంగంలో ఉదహరించినట్లు అణు ఇంధన రంగంలో ప్రైవేటు పెట్టుబడులు అవసరం అయ్యాయని, కొత్తగా నెలకొల్పనున్న చిన్న తరహా అణు రియాక్టర్ల కేంద్రాల (యస్.యం.ఆర్) యాజమాన్య హక్కులు ప్రైవేట్ సంస్థలకు దఖలు పరచడానికి అనువుగా 1962 నాటి అణు ఇంధన శక్తి చట్టాన్ని కూడా మోడీ సర్కారు సవరించే అవకాశం ఉన్నదని ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’ పత్రిక నివేదించింది.
అణు ఇంధనానికి సంబంధించిన రెండు చట్టాలలో తీసుకురానున్న సవరణలు ఎవరికి ప్రయోజనం కలిగిస్తాయన్న ప్రశ్నతో పాటు అణుశక్తి కేంద్రాల స్థాపనలో మన దేశానికి లేని, అమెరికా దగ్గర ఉన్న ప్రత్యేకమైన నైపుణ్యం ఏమిటని కూడా మనం ప్రశ్నించాలి. అణుశక్తి ఉత్పత్తిలో అమెరికన్ ప్రైవేటు కంపెనీలు ఈ మధ్య కాలంలో సాధించిన మనం ఎరుగని ప్రత్యేక ప్రగతి ఏమన్నా ఉన్నదా? ఉంటే తప్పకుండా మనం అలాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి మన పౌర నష్టాల పరిహార చట్టాన్ని పలుచన చేస్తున్నాం అన్నా…. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి ఈనాటి వరకు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అణు ఇంధన రంగాన్ని ప్రైవేటు యాజమాన్యానికి అప్పగిస్తున్నాం అన్నా అర్థం ఉండేదేమో. అలాంటి అవకాశాలు ఏమీ లేకుండానే మనం అమెరికన్ ప్రైవేటు వ్యాపార ప్రయోజనాల కోసం ఇంత ఉదారంగా మినహాయింపులు ఇవ్వడానికి దేనికి తహతహలాడుతున్నాం? ప్రజా ప్రయోజనాలకు, భద్రతకు నికరమైన రక్షణ కల్పించే చర్యలు చేపట్టకుండా హానికరమైన ఉత్పత్తుల తయారీకి ప్రైవేటు పరిశ్రమలకు అనుమతి ఇచ్చిన మూలంగా చవిచూసిన దారుణ పర్యవసానాలు ఏమిటో భోపాల్ విష వాయవుల ప్రమాదానంతరం మనం అనుభవించాం. చెర్నో బిల్ (రష్యా), ఫుకుషిమా (జపాన్) అణు కేంద్రాలలో ప్రమాదాలు సంభవించి నప్పుడు, ఆ ప్రమాద తీవ్రత భోపాల్ విష వాయు ఉదంతం మాదిరి స్థానికానికే పరిమితం కాకుండా జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా పెను ప్రభావం చూపిస్తాయి. ఆ ప్రభావాలు సుదీర్ఘ కాలంపాటు వెంటాడతాయి.
ఇప్పుడు ఒక్కో ప్రశ్నకు తగిన జవాబు ఏమిటో పరిశీలిద్దాం. ప్రస్తుతం అమెరికన్ ప్రైవేటు అణు పరిశ్రమలు మన దేశానికి ఆధునిక సాంకేతిక ఉత్పత్తి పరిజ్ఞానాన్ని అందివ్వనున్నాయా? మన దగ్గర లేని ఏ సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవడానికి మనం రూపొందించుకున్న పౌర నష్ట పరిహారాల చట్టాన్ని సడలించాలనుకుంటున్నాం? మనం ఉదారంగా ఏ అమెరికన్ కంపెనీలకు ఇంత భారీ రాయితీలు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాం? అమెరికా గత 25 సంవత్సరాల్లో కేవలం మూడంటే మూడు, అణు కేంద్రాలను నెలకొల్పి వినియోగంలోకి తెచ్చుకున్నది. టెన్నిస్ వ్యాలీ అధారిటీ ఆధ్వర్యంలో వాట్స్ బార్ యూనిట్-2ను 2016లో వినియోగంలోకి తీసుకు వచ్చింది. తదనంతరం జార్జియాలో ఓగ్టెల్ యూనిట్1, యూనిట్2 పేరిట మరో రెండు అణు కేంద్రాలను వరుసగా 2023, 2024 సంవత్సరాలలో వినియోగంలోకి తీసుకువచ్చారు. ఈ మూడు అణు కేంద్రాలను ‘వెస్టింగ్ హౌస్’ అనే ప్రైవేటు అమెరికన్ కంపెనీ నెలకొల్పింది. 2023లో వినియోగంలోకి వచ్చిన ఓగ్ టెల్ యూనిట్ 1 నిర్మాణం పూర్తి చేయ్యడానికి ‘వెస్టింగ్ హౌస్’ కంపెనీకి పదిహేనేళ్ళ సమయం పట్టింది. నిర్మాణ వ్యయం తొలి అంచనాల కన్నా రెట్టింపయి 37 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సి వచ్చింది.
దక్షిణ కరోలినా రాష్ట్ర ఎలక్ట్రిక్ అండ్ గ్యాస్ అధారిటీ కూడా ఇదే ‘వెస్టింగ్ హౌస్’ కంపెనీకి రెండు ఎ.పి 1000 యూనిట్ల అణు కేంద్రాల నిర్మాణానికి కాంట్రాక్ట్ ఇచ్చింది. ఈ రెండు కేంద్రాలు 2020 నాటికి వినియోగంలోకి రావాలి. కానీ వెస్టింగ్ హౌస్ కంపెనీ ఈ అణు కేంద్రాల నిర్మాణానికి 9 బిలియన్ డాలర్లు ఖర్చు చేశాక ఇక తమ వల్ల కాదని చేతులెత్తేసింది. ఆర్థిక సమస్యల రీత్యా దివాళా తీసి తిరిగి దివాళా చట్టం చాప్టర్ 11 కింద రక్షణ పొంది 2018లో మరలా ఉనికిలోకి వచ్చింది. అణు కేంద్రాల నిర్మాణంలో పక్కా డిజైన్లు, పటిష్టమైన ప్రణాళిక, పరిమిత వ్యయం, నిర్ధారిత సమయంలో ప్రాజెక్టులు పూర్తి చేయడం అమెరికన్ కంపెనీలకు పెట్టింది పేరనేది కేవలం ప్రచార పటాటోపం అని వెస్టింగ్ హౌస్ రుజువు చేసింది.
అణు కేంద్రాల నిర్మాణంలో బాగా పేరు మోసిన రెండు అమెరికన్ ప్రైవేటు కంపెనీలైన జీఈ వెస్టింగ్ హౌస్లు దివాళా తీసిన కంపెనీలే. జీఈ కంపెనీ అణు విభాగాన్ని జపాన్కు చెందిన హిటాచీ కంపెనీ స్వాధీనం చేసుకుంటే, ఉత్తర అమెరికాలో అతి పెద్ద ఇంధన వ్యాపార సంస్థ అయిన కెనడాకు చెందిన బ్రూక్ఫీల్డ్ కంపెనీ వెస్టింగ్ హౌస్ అణు విభాగాన్ని స్వాధీనం చేసుకున్నది. ఒకసారి దివాళా ఎత్తి జపాన్, కెనడా దేశాల స్వాధీన పెట్టుబడులతో తిరిగి వాణిజ్య కార్యకలాపాల కోసం తెరిచిపెట్టిన ఈ రెండు కంపెనీలు అణు కేంద్రాల నిర్మాణంలో మన దేశానికి కొత్తగా ఏం ఒరగబెడతాయి?
మధ్య తరహా అణు కేంద్రాల (యస్.యం.ఆర్) గురించి అమెరికా ఊదరగొట్టుడు ప్రచారం చేస్తుంటే, మోడీ ప్రభుత్వం వంత పాడుతున్నది. సంకేతికంగా చూస్తే ఈ రియాక్టర్లు కొత్తగా ఎలాంటి ప్రధానమైన మార్పులు తీసుకొచ్చేవి కాదు. ఉత్పత్తి సామార్థ్యాన్ని తగ్గించి, భవిష్యత్తులో అవసరాలకు తగినట్లు ఇలాంటివి ఎన్ని కావాలంటే అన్ని నెలకొల్పుకోవచ్చు అంటూ కేద్ర ప్రభుత్వం చేస్తున్న సమర్థింపు వాదనలు పసలేనివి. 300-500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి నిర్దేశించిన ఈ అణు కేంద్రాలు సర్కారు వారు వాదిస్తున్నట్లు చిన్న చిన్న (అణు) విద్యుత్ కేంద్రాలు కాదు. భారీ అణు విద్యుత కేంద్రాలు నెలకొల్పడానికి భారీగా వ్యయం చెయ్యాల్సి వస్తుంది. దాని మూలంగా ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి అయ్యే ఖర్చు అధికంగా ఉంటుంది. అదే యస్.యం.ఆర్ ల ద్వారా అయితే ఉత్పత్తి ఖర్చు తగ్గతుంది అనే వాదన కూడా కేవలం ఊహ మాత్రమే. పైన చెప్పుకున్నట్లు అణు కేంద్రాల నిర్మాణానికి అయిన వ్యయం ప్రాథమిక అంచనాల కన్నా రెట్టింపు అయితే అప్పుడు ప్రభుత్వం చేస్తున్న లాభనీతి వాదన అంతేసంగతులు. అలాగే ముందు మధ్యతరహా కేంద్రాలను స్థాపించుకుని భవిష్యత్ అవసరాల రీత్యా కేంద్రాల సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. తద్వారా నిర్మాణ, నిర్వహణా వ్యయాలు భారీగా ఆదా చేసుకోవచ్చు అనే వాదన కూడా అణు ఇంధన పరిశ్రమల వరకు చూస్తే రుజువుకి నిలబడేది కాదు.
అమెరికన్ కంపెనీలు అణు ఇంధన ప్లాంట్ల సామర్ధ్యాన్ని 500 మెగావాట్ల నుండి 1600 మెగా వాట్లకు పెంచిన సందర్భంలో సంక్లిష్టమైన డిజైన్లు, మార్పులతో ఖర్చులు తడిపి మోపెడు అయ్యాయి. ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ‘త్రీ మైల్ ఐలాండ్’ (అమెరికా), ఫు-కుషిమా (జపాన్) అణు కేంద్రాలలో సంభవించిన ప్రమాదాలకు దారి తీసిన పరిస్థితులు ఇవే.
అణు ప్రమాదం అంటూ జరిగితే చెల్లించుకునే మానవ మూల్యం అంతా ఇంతా కాదు. బాధితులకు పరిహారం చెల్లించడానికి కంపెనీలు దివాళా ఎత్తాల్సిందే. అయినప్పటికీ బాధితులకు నామ మాత్రపు పరిహారమే చెల్లించగలుగుతాయి.
అణు ప్రమాదం జరిగితే నష్ట పరిహారాన్ని ఆ అణు కేంద్ర యజమాన్యాలు, అలాగే నిర్మాణ సామాగ్రి సరఫరా చేసిన కంపెనీలు భరించాలని ప్రస్తుత చట్టం నిర్దేశిస్తుంది. సరఫరా కంపెనీలు, కంపెనీ యజమాన్యాలను ఈ బాధ్యత నుండి తప్పుకునే వీలు కల్పించేందుకు మోడీ ప్రభుత్వం తగిన సవరణలు తీసుకురానున్నదని సంకేతాలు అందుతున్నాయి. ఇది ప్రజా ప్రయోజనాలకు, దేశ ప్రయోజనాలకు నష్టం.
భోపాల్లో నెలకొల్పిన అమెరికన్ కంపెనీ ‘యూనియన్ కార్బైడ్’ నుండి మిధైల్ ఐసో సైనేట్ (మిక్) విష వాయువులు వెలువడి వందలాది మంది మరణించి వేలాది మంది తీవ్ర అనారోగ్యాలకు, నవజాత శిశువులు అంగ వైకల్యాలకు గురైన సంగతి మీకు గుర్తుండే ఉంటుంది. ఇంతటి తీవ్ర స్థాయి ప్రమాదం సంభవించినా యూనియన్ కార్బైడ్ చెల్లించిన నష్ట పరిహారం నామమాత్రమే. కేంద్ర ప్రభుత్వం, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలే ఎక్కువ భారాన్ని భరించాయి. ఈ నేపథ్యంలోనే అమెరికాతో అణు బప్పందం కుదుర్చుకునేట్లయితే ప్రమాదాలు సంభవిస్తే నష్ట పరిహారాన్ని పూర్తిగా అణు కేంద్రాల నిర్మాణాన్ని చేపట్టిన కంపెనీలు, ప్లాంట్ల నిర్మాణానికి సామాగ్రిని సరఫరా చేసిన కంపెనీలు భరించాలన్న క్లాజు ఉండాలని వామపక్ష పార్టీలు పట్టుబట్టాయి. తదనంతర కాలంలో ఈ మేరకు చట్టం రూపొందించారు. ప్రస్తుతం మోడీ ప్రభుత్వం ఈ క్లాజును సవరించాలని చూడడం అమెరికన్ కంపెనీలకు లబ్ధి చేకూర్చడానికే తప్ప దేశ ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాలు పరిరక్షించేందుకు కాదు. కాబట్టి ఇలాంటి దుర్మార్గమైన సవరణలను వ్యతిరేకించాలి.
ప్రమాదం అంటూ సంభవిస్తే అది నాసిరకం నిర్మాణ సామాగ్రిని సరఫరా చేసిన కంపెనీలు, నిర్మాణ-నిర్వహణ చేపట్టిన కంపెనీలే నష్ట పరిహారం చెల్లించాల్సి రావడం సహజ న్యాయ సూత్రం కదా. కానీ అమెరికన్ కంపెనీలు మీ చట్టంలో ప్రమాదానికి మమ్మల్ని బాధ్యులు చేసే క్లాజు ఎత్తివెయ్యమని మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకు వస్తున్నాయి. నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత నుండి తప్పించుకోవాలని చూస్తున్నాయి. అణు ఇంధన కేంద్రాల స్థాపనలో నిర్మాణ సామాగ్రి తయారీలో అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాలకు విశిష్ట అనుభవం ఉన్నదని బలంగా ప్రచారం జరుగుతున్నది.
ఈ ప్రచారంలో వాస్తవాలు ఏమిటో ఇప్పుడు పరిశీలిద్దాం. అమెరికన్ అణు ఇంధన పరిశ్రమల విషయానికి వద్దాం. ఈ మధ్యకాలంలో అమెరికాలో నెలకొల్పిన ‘ఓగ్ టెల్’ ప్లాంట్ నిర్మాణానికి అయిన ఖర్చు 37 బిలియన్ డాలర్లు. అంటే ఒక కిలోవాట్ విద్యుత్ ఉత్పత్తికి పెట్టే ఖర్చు 10,784 అమెరికన్ డాలర్లు. ఈ ప్లాంట్ ఉత్పత్తి చేసే ప్రతి మెగావాట్ విద్యుత్కి అయ్యే వ్యయం 170 నుండి 180 అమెరికన్ డాలర్లు. అదే ఒక కిలోవాట్ పవన, సౌర విద్యుత్ ఉత్పత్తికి అయ్యే ఖర్చు 1500 నుండి 2000 డాలర్లు మాత్రమే. అంటే ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి అయ్యే ఖర్చు 27 నుండి 92 డాలర్లు మాత్రమే. ఇవన్నీ ‘లాజార్ట్’ అనే అమెరికన్ ఫైనాన్షియల్ కంపెనీ కట్టిన లెక్కలే. ఈ వివరాలను బట్టి పవన-సౌర విద్యుత్ ఉత్పత్తికి అయ్యే ఖర్చు కన్నా అణు విద్యుత్ ఉత్పత్తికి రెట్టింపు ఖర్చు చెయ్యాల్సి వస్తుందని స్పష్టమవుతుంది. నిర్మాణ వ్యయంలో ఫ్రాన్స్ కూడా అమెరికాతో తీసిపోలేదు. ఇక ఇంగ్లాండ్ అయితే ఈ రంగం నుండి దాదాపు తప్పుకున్నట్లే.
భారత్, చైనా, దక్షిణ కొరియా, రష్యా దేశాలు దేశీయంగానే అణుకేంద్రాలను నెలకొల్పుకున్నాయి. ఈ నిర్మాణాలకు అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాల సహకారం కూడా ఏమీ తీసుకోలేదు. పై నాలుగు దేశాలూ ఇప్పటికీ దేశీయంగా అణు కేంద్రాలను నిర్మించుకునే సామర్ధ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ మధ్య కాలంలోనే మన దేశం కాక్రపార్లో 700 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యంగల రెండు అణు విద్యుత్ కేంద్రాలను నెలకొల్పింది. మధ్యతరహా అణు కేంద్రాలను 500 మెగావాట్ల సామర్థ్యంతో (యస్.యం.ఆర్) నెలకొల్పడానికి అమెరికన్ కంపెనీల మీద ఆధారపడే బదులు 700 మెగావాట్ల సామర్థ్యంగల ప్లాంట్లను నెలకొల్పుకున్న మనమే 500 మెగావాట్ల సామర్థ్యానికే పరమితం అయిన ప్లాంట్లను ఎందుకు నెలకొల్పుకోకూడదు. అయినా 500 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యమే యస్.ఆర్.యంలకు ప్రామాణికమని ఎవరు నిర్ణయించారు? 700 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంగల అణు కేంద్రాలు, యస్.యం.ఆర్ లు ఎందుకూ కాకుండా పోతాయి. అది నిర్ణయించుకోవాల్సింది మనమే.
యస్.యం.ఆర్ లు నెలకొల్పే పేరిట అమెరికన్ కంపెనీలు కొత్తగా ఇవ్వజూపుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అంటూ ఏమీ లేదు. దక్షిణ కొరియా, చైనా, రష్యా, భారతదేశాలు ఇప్పుడు ఈ కంపెనీలకు కావాల్సిన మార్కెట్లు. చైనా, రష్యా దేశాలు ఆ కంపెనీలను తమ దేశంలో అడుగు పెట్టనివ్వవు. ప్రస్తుతం రాజకీయ సంక్షోభంలో ఉన్న దక్షిణ కొరియాలో ఇప్పటికిప్పుడు అవకాశాలు లేవు. కాబట్టి అమెరికన్ కంపెనీలు మన దేశం మీద కన్ను వేశాయి. దేశీయంగా అణు పరిజ్ఞానం కలిగి, అణు కేంద్రాలు స్వయంగా నెలకొల్పుకోగలిగిన సామర్థ్యంగల మన దేశం అమెరికన్ కంపెనీలకు ఆ అవకాశం ఎందుకు ఇవ్వాలి? అది కూడా ప్రమాదం సంభవిస్తే ఆ కంపెనీలకు నష్ట పరిహా రం చెల్లించాల్సిన బాధ్యత లేకుండా చట్ట సవరణ చేసి మరీ ఎందుకు ఆహ్వానించాలి? ఫ్రెంచి కంపెనీ ఒక అణు ఇంధన కేంద్రాన్ని నిర్మించ డానికి ముందుకు వచ్చింది. ఈ ఒప్పందం ఇంకా కార్యరూపం దాల్చ లేదు. కానీ ఫ్రెంచి కంపెనీ అమెరికన్ కంపెనీలు డిమాండ్ చేస్తున్నట్లు నష్ట పరిహార చెల్లింపు బాధ్యత నుండి తప్పించమని అడగలేదు.
ఇలాంటి నేపథ్యంలో ప్రజా ప్రయోజనాలను, దేశ ప్రయోజనాలను ఫణంగా పెట్టి మోడీ ప్రభుత్వం అమెరికన్ కంపెనీల డిమాండ్లకు తలొగ్గి మరీ అణు కేంద్రాల నిర్మాణ ఒప్పందాలు కుదుర్చుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. అందుకే ఇలాంటి దగాకోరు ఒప్పందాలను దేశ ప్రజానీకం ముక్త కంఠంతో వ్యతిరేకించాలి.
ప్రబీర్ పుర్కాయస్థ
అమెరికన్ అణు రియాక్టర్లు – ప్రమాదంలో ప్రజా ప్రయోజనాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES