తిరుచ్చి : తమను ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించాలని, చిన్నారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని, ఇంకా పలు డిమాండ్ల పరిష్కారాన్ని కోరుతూ తమిళనాడు వ్యాప్తంగా పలు జిల్లాల్లో అంగన్వాడీ కార్యకర్తలు, అసిస్టెంట్లు మంగళవారం రహదారుల దిగ్బంధన నిర్వహించారు. తిరుచ్చి, పుదుకొట్టారు, తంజావూరు, అరియలూర్ జిల్లాల్లో నిరసనల సందర్భంగా అనేకమందిని అరెస్టు చేశారు. సీఐటీయూ అనుబంధ తమిళనాడు అంగన్వాడీ వర్కర్స్ అండ్ అసిస్టెంట్స్ అసోసియేషన్కి చెందినవారే వీరంతా. కుటుంబ పెన్షన్గా రూ.9వేలు ఇవ్వాలని, రిటైరైతే రూ.10లక్షల గ్రాట్యూటీ ఇవ్వాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. తిరుచ్చిలో జిల్లా కలెక్టరేట్ సమీపంలో దాదాపు వెయ్యిమంది అంగన్వాడీ వర్కర్లు, అసిస్టెంట్లు దాదాపుగా గంట పాటు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం రోడ్డు రోకోకు దిగడంతో వెంటనే వారిని అదుపులోకి తీసుకుని తర్వాత విడుదల చేశామని పోలీసులు తెలిపారు. పుదుకొట్టారు పట్టణంలో కూడా దాదాపు 1200మంది నిరసనలకు దిగారు. రహదారులను దిగ్బంధించారు. అనంతరం పోలీసులు వారిని అరెస్టు చేసి, కాసేపటి తర్వాత వదిలిపెట్టారు. అరియలూర్ పట్టణంలో 500మందికి పైగా అరెస్టయ్యారు. అన్నా విగ్రహం సమీపంలో వారు పికెటింగ్ చేశారు. తంజావూరులో 385మందిని అరెస్టు చేసి వదిలిపెట్టారు.



