వలస ఓటర్లకు అభ్యర్థుల పిలుపులు
ప్రయాణ ఖర్చులు చెల్లిస్తామని హామీలు!
నవతెలంగాణ – మల్హర్ రావు
ఓటు వేయడానికి రావాలని,ప్రయాణం, మిగతా ఖర్చులన్నీ చెల్లిస్తామంటూ బరిలో నిలిచిన అభ్యర్థులు వలస ఓటర్లను ప్రలోభపెడుతున్నారు. ఏ ఎన్నికలు వచ్చినా ఊరు విడిచి ఇతర పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లి జీవించే వారి ఓట్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు నానా తంటాలు పడుతుంటారు. అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా వలస ఓటర్లను తమ వైపు ఆకర్శించడం కోసం నయానా…బయానా ఇస్తుంటారు. ఒకరికంటే ఒకరు ఎత్తులకు పైఎత్తులు వేసి వారి ఓట్లను తమవైపు తిప్పుకునేలా చూస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో తక్కువ ఓట్లతోనే జయాపజయాలుంటాయి గనుక వారిని ఏదో రకంగా ఓటు వేయించాలని కంకణం కట్టుకుంటున్నారు.
ప్రతి గ్రామం నుంచి 50 నుంచి 100 మంది వరకు ఇతర ప్రాంతాల్లో కూలీ పనులు చేసుకొని జీవిస్తున్నారు.ఒక్క రోజు పని పోయినా ఆ కూలీ డబ్బులను మేమే చెల్లిస్తామని, కారులో వస్తారా ?బస్సులో వస్తారా? ప్రత్యేకంగా వాహనాన్ని మాట్లాడుకొని వస్తారా? అంటూ బేరసారాలు ఆడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. విచిత్రమేమిటంటే గ్రామంలోని ఓటర్ల కంటే ముందుగా వలస వెళ్లిన ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారని సమాచారం ఒక్కొక్కరికి కొందరు రూ.500 ఇస్తే, మరికొందరు రూ.600 ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. కొన్ని ముఖ్యమైన పంచాయతీల్లో అయితే రూ.వెయ్యి కూడా చెల్లిస్తున్నట్లు వినికిడి. పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆసక్తి చూపుతారు. కాగా పంచాయతీ ఎన్నికల్లో ఒక్కో ఓటు ఎంతో విలువైనది కావడంతో వలస ఓటర్లకు డిమాండ్ పెరిగింది.



