Tuesday, June 24, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఫోర్డో అణుకేంద్రంపై మళ్లీ దాడి

ఫోర్డో అణుకేంద్రంపై మళ్లీ దాడి

- Advertisement -

– ఇరాన్‌పై ఆగని ఇజ్రాయిల్‌ దమనకాండ
– దౌత్యానికి సమయం మించిపోయింది : ఇరాన్‌
– ఇరాన్‌ క్షిపణుల ప్రతి దాడులతో ఇజ్రాయిల్‌లో కరెంట్‌ కట్‌
– ఇరాన్‌కు అవసరమైన సాయం చేస్తాం : రష్యా
– తనిఖీలకు అనుమతించండి : ఇరాన్‌కు ఐఏఈఏ విజ్ఞప్తి
– హర్మూజ్‌ జలసంధిలో ఆయిల్‌ ట్యాంకర్లు యూ టర్న్‌
టెల్‌ అవీవ్‌, టెహరాన్‌:
భూగర్భంలోని ఇరాన్‌ ఫోర్డో అణు కేంద్రంపై మరోసారి దాడి జరిగింది. ఆదివారం బి2 బాంబర్లతో అమెరికా మూడు అణు కేంద్రా లపై దాడులు చేసిన విషయం తెలిసిందే. సోమవారం ఇజ్రాయిల్‌ మళ్ళీ అవే కేంద్రాలపై మళ్లీ దాడులకు దిగింది. ఇరాన్‌ రాజధాని టెహరాన్‌లోని ఎవిన్‌ జైలు, పారా మిలటరీ రివ ల్యూషనరీ గార్డ్స్‌కి చెందిన సెక్యూరిటీ హెడ్‌క్వార్టర్ప్‌పై కూడా దాడులు చేశామని ఇజ్రాయిల్‌ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరాన్‌ ప్రభుత్వ టీవీ వర్గాలు కూడా ఈ దాడుల సమాచారాన్ని ధృవీకరించాయి. నష్టం వివరాలు వెల్లడించలేదు. ఫోర్డో యురేనియం శుద్ధి కేంద్రానికి దారి తీసే మార్గాలను నాశనం చేసేందుకే తమ బలగాలు దాడి జరిపాయని ఇజ్రాయిల్‌ బలగాలు వెల్లడించాయి. సోమవారం తెల్లవారు జామునుండే ఇరుపక్షాల మధ్య వైమానిక దాడులు భీకరంగా మొదలయ్యాయి. మిలటరీ లక్ష్యాలపైనే వరుసగా గురి పెట్టినట్లు ఇజ్రాయిల్‌ వైమానికదళం తెలిపింది. ఎవిన్‌ జైలు గేటు వద్ద దాడి జరిగిందని ఇరాన్‌ ప్రభుత్వ టీవీ తెలిపింది. డ్రోన్లతో ఈ దాడి జరిగి వుండవచ్చని అనుమానిస్తున్నారు.

తమ అణు స్థావరాలపై అమెరికా బంకర్‌ బస్టర్‌ బాంబులతో జరిపిన దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ పేర్కొంది. ఆదివారం నాడి దాడులతో ఇరాన్‌ అణు సామర్ధ్యాలను తీవ్రంగా దెబ్బతీశామనీ, తామనుకున్న లక్ష్యాలు సాధించామని ఇజ్రాయిల్‌ ప్రకటించింది. ఇరాన్‌తో దౌత్య చర్చలు తిరిగి ప్రారంభించాలనుకుంటున్నట్టు ట్రంప్‌ ప్రభుత్వం తాజాగా మరో సందేశం పంపింది. ఇరాన్‌తో యుద్ధాన్ని కోరుకోవడం లేదని అమెరికా రక్షణమంత్రి పీట్‌ హెగ్‌సెథ్‌ విలేకర్లకు చెప్పారు. దీనిపై ఇరాన్‌ స్పందిస్తూ దౌత్య సమయం దాటిపోయిందని, ఇక ఆత్మరక్షణ కోసం చేసే దాడులు మాత్రమే మిగిలివున్నాయని తేల్చిచెప్పింది.
హోర్ముజ్‌ జలసంధిలో ట్యాంకర్లు యూ టర్న్‌
ఇరాన్‌పై అమెరికా మిలటరీ దాడుల నేపథ్యంలో హోర్ముజ్‌ జలసంధిలో రెండు సూపర్‌ ట్యాంకర్లు యూ టర్న్‌ తీసుకున్నట్లు షిప్‌ ట్రాకింగ్‌ డేటా తెలిపింది. ఈ ప్రాంతంలో గత పదిరోజులుగా చెలరేగుతున్న హింస, దాడుల్లో చాలా నౌకలు నిలిచిపోవడం, లేదా ప్రయాణ మార్గాలను మార్చుకోవడమో చేస్తున్నాయి.
క్షిపణుల దాడితో నిలిచిన విద్యుత్‌
ఇరాన్‌ తాజా క్షిపణుల దాడులతో ఇజ్రాయిల్‌ విద్యుత్‌ సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఇజ్రాయిల్‌ ఎలక్ట్రిక్‌ కార్పొరేషన్‌ కేంద్రంపై జరిగిన దాడుల వల్ల ఆ ఏరియాలోని పలు కమ్యూనిటీలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. సోమవారం ఉత్తర ఇజ్రాయిల్‌లోని పలు ప్రాంతాల్లో ఇరాన్‌ క్షిపణులతో దాడులు జరిపింది. దాడులను హెచ్చరిస్తూ పలుసార్లు సైరన్లు మోగాయి.

ఇరాన్‌కు సాయంచేసేందుకు సిద్ధం : రష్యా
ఇరాన్‌కు అన్ని రకాల సహాయాన్ని చేసేందుకు రష్యా సిద్ధంగా వుందని రష్యా ప్రకటించింది. అయితే టెహరాన్‌ ఏం కోరుతుందనే దానిపైనే అంతా ఆధారపడి వుంటుందని క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రి పెస్కొవ్‌ సోమవారం తెలిపారు. మధ్యవర్తిత్వ ప్రయత్నాలు చేస్తామన్నారు. ఈ యుద్ధంపై తమ వైఖరినీ స్పష్టం చేశామన్నారు. ఈ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ ఇంధన మార్కెట్‌లో నెలకొన్న అస్థిర పరిస్థితులపై ప్రధాన చమురు ఉత్పత్తిదారులైన రష్యా, ఇరాక్‌లు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ మేరకు పుతిన్‌, ఇరాక్‌ ప్రధాని మహ్మద్‌ షియా అల్‌ సుడాని ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఇరాన్‌పై దురాక్రమణకు ఎలాంటి ఆధారం లేదని పుతిన్‌ వ్యాఖ్యానించారు. మాస్కోలో ఇరాన్‌ విదేశాంగ మంత్రి అరగ్చితో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సాయం కోసం ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖొమేనీ మాస్కోకు ఇరాన్‌ విదేశాంగ మంత్రిని పంపారు. ఈ సందర్భంగా ఇరాన్‌ ప్రజలకు సాయంచేసేందుకు రష్యా సిద్ధంగా వుందని ప్రకటించారు.

తనిఖీలకు అనుమతించాలి
ఇరాన్‌ అణు కేంద్రాలపై అమెరికా బాంబు దాడులు జరిపిన నేపథ్యంలో తమ ఇన్‌స్పెక్టర్లను ఆ ప్రాంతాల్లో తనిఖీలకు అనుమతించాలని అంతర్జాతీయ అణు పర్యవేక్షక సంస్థ (ఐఎఇఎ) చీఫ్‌ రాఫెల్‌ మారియానో గ్రాసీ సోమవారం కోరారు. శుద్ధిచేసిన యురేనియం నిల్వల జాబితాను గమనంలోకి తీసుకునే ప్రయత్నంలో తమను అనుమతించాల న్నారు. తక్షణమే కాల్పుల విరమణ జరపాలని ఇరు పక్షాలను కోరారు.
తప్పుడు ప్రచారం : భారత్‌
ఇరాన్‌పై దాడులకు భారత గగనతలాన్ని అమెరికా ఉపయోగించుకుందంటూ వచ్చిన వార్తలను భారత ప్రభుత్వం కొట్టిపారేసింది. ఇవన్నీ నిరాధారమైన, బూటకపు సమాచారమని తేల్చి చెప్పింది. అమెరికా విమానాలు ఉపయోగించుకున్న మార్గాన్ని జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ జనరల్‌ డాన్‌ కెయిన్‌ పత్రికా సమావేశంలో వివరించారు. ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్‌ చెక్‌ యూనిట్‌ దీనిపై ఎక్స్‌లో పోస్టు పెట్టింది.
ప్రమాదకర వైఖరి : యూఎన్‌ చీఫ్‌
ఇరాన్‌ అణు కేంద్రాలపై అమెరికా దాడులు పశ్చిమాసియాలో ప్రమాదకరమైన వైఖరి అని ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జనరల్‌ ఆంటానియో గుటెరస్‌ వ్యాఖ్యానించారు. భద్రతామండలి అత్యవసర సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరో విధ్వంసాన్ని ఈ ప్రాంత ప్రజలు ఎంతమాత్రం భరించలేరన్నారు. అంతర్జాతీయ సమాజమంతా ఏక తాటిపైకి వచ్చి ఈ యుద్ధాన్ని ఆపేందుకు నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని కోరారు. ఇరాన్‌ అణు కార్యక్రమంపై చర్చలు కొనసాగేలా చూడాల్సి వుందన్నారు. అలాగే ఇరాన్‌ కూడా అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని పూర్తిగా గౌరవించాలనీ, అంతర్జాతీయ శాంతి భద్రతలకు ఇదే కీలకమని ఆయన తెలిపారు.

ఇరాన్‌ ప్రతీకార దాడులు..
అణు స్థావరాలపై దాడులకు ప్రతీకారంగా అమెరికాకు సర్వశక్తులతో బదులిస్తామని ఇరాన్‌ హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో పశ్చిమాసియాలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలను టెహరాన్‌ లక్ష్యంగా చేసుకునే అవకాశాలు ఉన్నాయంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే ఖతార్‌ రాజధాని దోహాలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఖతార్‌ తన గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేసినట్టు ప్రకటించిన కొద్దిసేపటికే ఈ పేలుడు శబ్దాలు వినిపించడం గమనార్హం. ఖతార్‌లోని అమెరికాకు చెందిన అల్‌ ఉదీద్‌ ఎయిర్‌ బేస్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసినట్టు ఇరాన్‌ ప్రకటించింది. ఈ స్థావరం పశ్చిమాసియాలోనే అతిపెద్దది. ఇక్కడ దాదాపు 10 వేలమంది అమెరికన్‌ సైనికులు ఉన్నట్టు తెలుస్తోంది.

చైనా విజ్ఞప్తి
యుద్ధం ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా నివారించేందుకు తక్షణమే ఇరు పక్షాలు ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని చైనా కోరింది. రాజకీయ పరిష్కారాన్ని కనుగొనే పంథాను అనుసరించాలని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గుయో జియాకున్‌ కోరారు.

అల్బా ఖండన
ఇరాన్‌ అణు కేంద్రాలపై ఆదివారం నాటి అమెరికా దాడిని బొలివారియన్‌ అలయన్స్‌ ఫర్‌ ది పీపుల్స్‌ ఆఫ్‌ అవర్‌ అమెరికా (అల్బా) తీవ్రంగా ఖండించింది. ఈ దాడులపై అంతర్జాతీయ సమాజం తీవ్రంగా స్పందించాలని కోరింది. అక్రమ, ఏకపక్ష చర్యలను తక్షణమే విరమించాలని డిమాండ్‌ చూస్తూ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇరాన్‌ సార్వభౌమాదికారంపై, ప్రాదేశిక సమగ్రతపై దాడి ఆమోదయోగ్యం కాదని తెలిపింది. దేశాల మధ్య శాంతియుత సహజీవనం ఉండాలని ఆకాంక్షించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -