నవతెలంగాణ – ఢాకా : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై మరో అభియోగం నమోదైంది. 2024 విద్యార్థుల నేతృత్వంలోని తిరుగుబాటును హింసాత్మకంగా అణచివేయడంతో పాటు మానవత్వంపై క్రూరత్వం నేరాలకు సంబంధించి ఆమెపై అభియోగాన్ని మోపినట్లు ప్రాసిక్యూటర్లు ఆదివారం తెలిపారు. షేక్ హసీనాతో పాటు మరో ఇద్దరు అధికారులపై ఈ కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర భద్రతా దళాలు, ఆమె రాజకీయ పార్టీ మరియు అనుబంధ సమూహాలు భారీ ప్రాణ నష్టం కలిగేలా ఆపరేషన్లు నిర్వహించాలని హసీనా నేరుగా ఆదేశించారని దర్యాప్తు నివేదికలో తేలింది.
”ఈ హత్యలు ప్రణాళిక ప్రకారం జరిగాయి” అని వీడియో ఆధారాలు, వివిధ ఏజన్సీల దర్యాప్తును ఉటంకిస్తూ చీఫ్ ప్రాసిక్యూటర్ తాజుల్ ఇస్లాం ఆదివారం మీడియాకి తెలిపారు. ఈ కేసులో 81మందిని సాక్షులుగా చేర్చామని అన్నారు. ప్రభుత్వ అధినేతగా హసీనా, ఉద్రిక్తతల సమయంలో భద్రతా దళాల కార్యకలాపాలకు బాధ్యత వహిస్తారని పేర్కొన్నారు. ఉద్రిక్తతల్లో 1500 మంది మరణించగా, 25,000 మంది గాయపడినట్లు ఇస్లాం తెలిపారు.
నిరసనకారుల ఒత్తిడితో హసీనా ఆగస్టులో అధ్యక్ష పదవికి రాజీనామా చేసి దేశాన్ని విడిచి పారిపోయారు. ప్రస్తుతం ఆమె భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. ఆమెతో పాటు కుటుంబసభ్యులు కూడా పలు అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.