Tuesday, June 3, 2025
E-PAPER
Homeజాతీయంఫలితమివ్వని మరో కేంద్ర పథకం

ఫలితమివ్వని మరో కేంద్ర పథకం

- Advertisement -

– ఐఓఈ కింద విద్యా సంస్థలకు అరకొర సాయం
– లోపించిన పర్యవేక్షణ

న్యూఢిల్లీ : ఎంపిక చేసిన ఉన్నత విద్యా సంస్థలలో అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలను పెంచేందుకు 2017లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌ (ఐఓఈ) పథకం ఆశించిన ఫలితాలు పొందలేకపోతోంది. కేంద్రం నుండి పూర్తి స్థాయిలో నిధులు అందకపోవడమే దీనికి ప్రధాన కారణం. ప్రభుత్వ నిధులతో నడుస్తున్న ఎనిమిది విద్యాసంస్థలకు 2018-19 నుండి ఏడు ఆర్థిక సంవత్సరాలలో వెయ్యి కోట్ల రూపాయల చొప్పున సాయం అందిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం దానిని నిలుపుకోవడంలో విఫలమైంది. 2021 ఫిబ్రవరి నుండి పథకం అమలును పర్యవేక్షించేందుకు విద్యా శాఖ కనీసం సాధికారత నిపుణుల కమిటీని (ఈఈసీ) పునర్నిర్మించలేకపోయింది. మూడు సంవత్సరాల కాలపరిమితితో ఏర్పాటు చేసిన తొలి కమిటీ గడువు 2021 ఫిబ్రవరితో ముగిసింది. అప్పటి నుండి పథకాన్ని పట్టించుకున్న నాథుడే లేడు.
గత ఏడు ఆర్థిక సంవత్సరాలలో ఎనిమిది విద్యా సంస్థలకు మొత్తం రూ.8,000 కోట్లు అందజేయాల్సి ఉండ గా ప్రభుత్వం కేవలం రూ.6.198.97 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. 2018-19 నుండి 2024-25 వరకూ ఒక్కో సంస్థకు వెయ్యి కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా ఐఐటీ ఢిల్లీకి రూ.736.31 కోట్లు, ఐఐటీ బాంబేకు రూ.905.59 కోట్లు, ఐఐటీ మద్రాస్‌కు రూ.1,000 కోట్లు, ఐఐటీ ఖరగ్‌పూర్‌కు రూ.672.05 కోట్లు, ఐఐఎస్‌సీ బెంగళూరుకు రూ.916.86 కోట్లు, బనారస్‌ హిందూ యూనివర్సిటీకి రూ.712.48 కోట్లు, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌కు రూ.775.06 కోట్లు, యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీకి రూ.480.62 కోట్లు మాత్రమే మంజూరయ్యాయి.
ఐఐటీ మద్రాస్‌కు మాత్రమే ఇచ్చిన హామీ మేరకు పూర్తి స్థాయిలో రూ.1,000 కోట్ల ఆర్థిక సాయం అందింది. అన్నింటి కంటే యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీకి అతి తక్కువగా కేవలం రూ.480.62 కోట్లు మాత్రమే వచ్చాయి. ఐఓఈ పథకం కింద ఎంపిక చేసిన నాలుగు ఐఐటీలలో ఖరగ్‌పూర్‌ ఐఐటీకి అతి తక్కువగా రూ.672.05 కోట్లు మంజూరు చేశారు. 2018, 2019 సంవత్సరాలలో ఈ పథకం కింద పది ప్రైవేటు సంస్థలు సహా 20 సంస్థలను ఎంపిక చేశారు. ఐఓఈ హోదా లభించిన సంస్థలు అధ్యాపకుల నియామకంలోనూ, విద్యార్థుల ప్రవేశంలోనూ, ఆఫ్‌షోర్‌ క్యాంపస్‌ల ఏర్పాటులోనూ స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉంటాయి. అంతేకాక ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తొలి 500 స్థానాలలో ఉన్న విద్యా సంస్థలలో వీటికి కూడా పది సంవత్సరాల పాటు చోటు లభిస్తుంది.
నిపుణుల కమిటీని పునర్నిర్మించడంలో జరిగిన జాప్యం కారణంగా నాలుగు ప్రైవేటు సంస్థలకు ఐఓఈ హోదా లభించడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. జియో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిలయన్స్‌ ఫౌండేషన్‌, వెల్లూర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (విట్‌), భువనేశ్వర్‌లోని కళింగ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండిస్టియల్‌ టెక్నాలజీ (కేఐఐటీ), కోయంబత్తూరులోని అమృత విశ్వ విద్యాపీఠం…ఈ నాలుగు సంస్థలు 2018, 2019లో ఈ హోదా పొందేందుకు ఎంపికయ్యాయి.
ఈఈసీని 2018 ఫిబ్రవరిలో ఏర్పాటు చేశారు. మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఎన్‌.గోపాలస్వామి దీనికి నేతృత్వం వహించారు. దీని పదవీకాలం 2021తో ముగిసినా దానిని నేటికీ పునర్నిర్మించలేదు. గత రెండు సంవత్సరాలుగా సమీక్షా సమావేశాలు కూడా జరగడం లేదు. ‘ఇది చాలా దురదృష్టకరం. ఐఓఈ పథకం కింద హామీ ఇచ్చిన నిధులను మంజూరు చేయడం లేదు. నిధుల వినియోగాన్ని నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుంది. అయితే కమిటీని ఏర్పాటు చేయకపోవడంతో ఆ పని కూడా జరగడం లేదు. పథకాన్ని విజయవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అయితే ఇది కూడా జాతీయ విద్యా విధాన (ఎన్‌ఈపీ) పథకాల మాదిరే తయారైంది. జవాబుదారీతనంతో నాణ్యతలో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరగడం లేదు’ అని ఢిల్లీ యూనివర్సిటీ కార్యనిర్వాహక మండలి మాజీ సభ్యుడు అభా దేవ్‌ హబీబ్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -