Tuesday, June 3, 2025
E-PAPER
Homeజాతీయంబాసటగా నిలిచే మిత్రులేరి?

బాసటగా నిలిచే మిత్రులేరి?

- Advertisement -

– ఫలితమివ్వని మోడీ విదేశాంగ విధానం
– ఇమేజ్‌ పెంచుకునేందుకే విదేశీ పర్యటనలు
– ప్రతినిధి బృందాల ఎంపికలోనూ రాజకీయాలే
– సంక్షోభ సమయంలో కానరాని ఐక్యత
ఆపరేషన్‌ సిందూర్‌ విషయంలో భారత్‌ వైఖరిని ప్రపంచ దేశాలకు వివరించేందుకు అఖిలపక్ష ప్రతినిధి బృందాలను పంపాలని ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం అనేక మందిని ఆశ్చర్యపరచింది. కేంద్రంలో నెంబర్‌ 2గా కొనసాగుతున్న హోం మంత్రి అమిత్‌ షా ఆపరేషన్‌ సిందూర్‌ను దేశ ‘భద్రతా సిద్ధాంతం’ గా అభివర్ణించారు. ఈ విజయానికి ప్రధాని నిర్ణయాత్మక నాయకత్వమే కారణమని ప్రశం సించారు. పాకిస్తాన్‌ ఉపయోగించిన చైనా తయారీ వైమానిక రక్షణ వ్యవస్థను మన వైమానిక దళం ధ్వంసం చేసిందని ప్రభుత్వం ప్రకటించింది. మరి అలాంటప్పుడు విదేశాల్లో తన ఇమేజీని పెంచుకోవడానికి మోడీ బృందం ప్రతిపక్షాల సహకారాన్ని ఎందుకు కోరాల్సి వచ్చింది? మోడీ లాంటి బలమైన నాయకుడు ఏయే కారణాలతో ఆ నిర్ణయానికి వచ్చారు? ప్రభుత్వ నూతన ఉగ్రవాద వ్యతిరేక సిద్ధాంతా నికి ప్రతిపక్షాల మద్దతు కావాల్సి వచ్చిందా?
న్యూఢిల్లీ:
భారత ప్రభుత్వం వివిధ పార్టీలకు చెందిన 59 మంది ఎంపీలతో కూడిన బృందాలను 32 దేశాలకు పంపింది. అందులో కొన్ని ప్రతినిధి బృందాలకు ప్రతిపక్ష ఎంపీలు, మరికొన్ని బృందాలకు ఎన్డీఏ ఎంపీలు నేతృత్వం వహిస్తున్నారు. ప్రభుత్వ సిద్ధాంతాన్ని వివరించడానికి వారు ఆయా దేశాలకు చెందిన పార్లమెంటేరియన్లు, విద్యావేత్తలు, పాత్రికేయులను కలిసే పనిలో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. అయితే దురదృష్టవశాత్తూ అఖిలపక్ష ప్రతినిధి బృందాల ప్రణాళిక ప్రారంభంలోనే వివాదంలో చిక్కుకుంది.
గత ప్రభుత్వ వైఖరులకు భిన్నంగా మోడీ ప్రభుత్వం ప్రతినిధి బృందాలలోని సభ్యుల ఎంపికను రాజకీయం చేసింది. ఇతర పార్టీల నుండి తనకు నచ్చిన వారిని ప్రతినిధులుగా ఎంచుకుంది. ఆయా పార్టీల సూచనలను బేఖాతరు చేసింది. ఉదాహరణకు కాంగ్రెస్‌ సూచించిన జాబితాలో లేని శశి థరూర్‌ను ఓ ప్రతినిధి బృందంలోకి తీసుకుంది. ఆయన ఇటీవలి కాలంలో మోడీ ప్రభుత్వ పనితీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ విషయంలో కూడా ఇలాగే జరిగింది. కేంద్రంపై ఆగ్రహంతో ఉన్న ఆ పార్టీ అధినేత మమతా బెనర్జీ ప్రతినిధి బృందాన్ని బహిష్కరించారు. అయినప్పటికీ మోడీ బృందం ఆమె మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీని ప్రతినిధి బృందంలో చేర్చింది. ప్రతినిధి బృందాన్ని బహిష్కరిస్తామని ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంంలోని శివసేన బెదిరించగా మోడీ బృందం దిగివచ్చి ప్రియాంక చతుర్వేదిని ప్రతినిధి బృందంలో పంపింది. జాతీయంగా సవాళ్లు ఎదురైనప్పుడు మన దేశం 1960వ దశకం నుంచి ఐక్యంగానే ఎదుర్కొంది. విదేశాలకు ప్రతి నిధుల ఎంపికలో ఎన్నడూ రాజకీయం చేయలేదు. ప్రకృతి వైపరీత్యాలు, విదేశీ బెదిరింపులు, ఉగ్ర వాదం వంటి విషయాలలో రాజకీయ పార్టీలలో ఏకాభిప్రాయం వ్యక్తమయ్యేది. ఇప్పుడు కూడా ప్రధానికి ప్రతిపక్షాల నుంచి పూర్తి సహకారం లభించింది. కానీ ఆయన మాత్రం ఐక్యతకన్నా రాజకీయాలకే ప్రాధాన్యతను ఇవ్వడం వివాదంగా మారింది.
2023 సెప్టెంబర్‌ 9, 10 తేదీలలో జి-20 సదస్సు జరి గింది. ఆ ఏడాది పొడవునా ఆ సదస్సును ‘బలమైన నాయకుని మహోత్సవం’గా కీర్తిస్తూనే ఉన్నారు. మోడీ ప్రవచించిన అమృత్‌కాల్‌పై ఘనంగా ప్రచారం చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం యావత్తూ తలమునకలైంది. వాస్తవానికి అది పూర్తి స్థాయిలో జరిగిన మోడీ ప్రదర్శన. దేశాన్ని నడిపించడానికి విశ్వగురు వచ్చారంటూ మీడియా పుంఖాను పుంఖాలుగా కథనాలు వండి వార్చింది. అయితే ఇప్పుడు ఆ సదస్సులో పాల్గొన్న దేశాలేవీ భారత్‌కు మద్దతు ఇవ్వలేదు. అవేవీ బాసటగా రాలేదు. సార్క్‌, బిమ్‌స్టెక్‌ సభ్యదేశాలదీ అదే వైఖరి. విదేశాంగ మంత్రిని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మూడు ప్రశ్నలు అడిగారు. భారత్‌ను పాకిస్తాన్‌తో ఎందుకు ముడి పెట్టారు? పాకిస్తాన్‌ను ఖండించడంలో భారత్‌కు ఏ ఒక్క దేశం కూడా ఎందుకు మద్దతు ఇవ్వలేదు? భారత్‌కు అనుకూలంగా యుద్ధం సాగుతున్నప్పుడు కాల్పుల విరమణపై ఒత్తిడి తేవడంలో ట్రంప్‌ పాత్ర ఏమిటి?…ఈ మూడు ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానం లేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -