Thursday, June 5, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుయుద్ధం వద్దంటే దేశద్రోహులా?

యుద్ధం వద్దంటే దేశద్రోహులా?

- Advertisement -

– దేశానికి మంచీచెడు చెప్పగలిగేది కమ్యూనిస్టులే..!
– యుద్ధానికి సై అన్నవాళ్లు ఇప్పుడు వద్దని ఒడంబడిక
– అమెరికా అధ్యక్షుని అబద్ధపు ప్రకటనను ఖండించలేని మోడీ
– ప్రపంచ దేశాలపై అమెరికా పన్నుల దాడి
– భారత రైతాంగాన్ని దివాలా తీయించే చర్యలు తిప్పికొట్టాలి
– సంక్రాంతి మధుసూదన్‌రావు సంస్మరణ సభలో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
– సమస్యలపై మేల్కొలిపేది వామపక్షాలే : నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవి
– కమ్యూనిస్టులే దేశానికి భవిష్యత్తు : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని

నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి/ కొణిజర్ల
యుద్ధం వద్దన్నందుకు కొందరు.. కమ్యూనిస్టులను దేశద్రోహులుగా చిత్రీకరించేందుకు యత్నించారని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. చివరకు యుద్ధానికి పురిగొల్పిన వాళ్లే వద్దని ఒడంబడిక చేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. దేశానికి ఏది మంచో.. ఏది చెడో.. చెప్పగలిగేది కమ్యూనిస్టులని అన్నారు. పార్టీ విచ్ఛిన్నమైన ప్రాంతంలో ఏటికి ఎదురొడ్డి పోరాడిన మధుసూదన్‌రావు స్ఫూర్తితో భవిష్యత్తుపై నమ్మకంతో ముందుకెళ్లా లని పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం లాలాపురంలో ఆదివారం నిర్వహించిన సంక్రాంతి మధుసూదన్‌రావు సంస్మరణ సభకు నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవి, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రంతో కలిసి బీవీ రాఘవులు హాజరయ్యారు. ముందుగా మధుసూదన్‌రావు స్మారక స్థూపాన్ని ఆవిష్కరించా రు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు జెండా ఎగురవేశారు. అనంతరం పార్టీ వైరా డివిజన్‌ కార్యదర్శి భూక్యా వీరభద్రం అధ్యక్షతన జరిగిన సభలో బీవీ రాఘవులు మాట్లాడారు.
ఏప్రిల్‌ 22 నుంచి పాకిస్తాన్‌- ఇండియా మధ్య యుద్ధవాతావరణం చూస్తున్నామన్నారు. పహల్గాంలో పర్యాటకులపై దాడి జరిగినప్పటి నుంచి ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. పాకిస్తాన్‌కు చెందిన తొమ్మిది ఉగ్ర స్థావరాలపై భారతసైన్యం దాడులు నిర్వహించిందన్నారు. కారణాలు ఏవైనా కాల్పుల విరమణకు ఇరుదేశాలు ఒప్పందం చేసుకున్నాయ ని తెలిపారు. 26 మంది పర్యాటకుల ప్రాణాలను బలితీసుకున్న పాకిస్తాన్‌పై యుద్ధం చేయాలనీ, అదే పరిష్కారమని అనేక మంది రెచ్చగొట్టారని అన్నారు. కానీ కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌, మరికొన్ని ప్రతిపక్ష పార్టీలు మాత్రమే యుద్ధం వద్దన్నాయని తెలిపారు. ఆయా దేశాల జోక్యంతో శాంతియుతం గా దీన్ని పరిష్కరించుకోవాలన్నందుకు కొందరు.. కమ్యూనిస్టులను దేశద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారన్నారు. చివరకు యుద్ధం పరిష్కారం కాదని.. ఒడంబడిక చేసుకోవాల్సి వచ్చిందన్నారు. ఎవరైతే యుద్ధం చేయాలని పురిగొల్పారో వారే యుద్ధం పరిష్కారం కాదని ప్రకటించాల్సిన స్థితికి వచ్చారన్నారు. ఈ దేశానికి ఏది మంచో.. ఏది చెడో చెప్పగలిగేది కమ్యూనిస్టులేనని స్పష్టంచేశారు. అటువంటి వారసత్వం మనకు మధుసూదన్‌రావు ఇచ్చారన్నారు. అమెరికా అధ్యక్షులు ట్రంప్‌ ఒడంబడిక చేసి భారత్‌, పాక్‌ యుద్ధాన్ని నిలువరించామని బూటకపు ప్రకటన చేసినా.. మోడీ మాట మాత్రం కూడా మాకు మేము వద్దనుకున్నామని చెప్పలేని స్థితిలో ఉన్నారన్నారు. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం తన నిర్ణయం తాను చేసుకోకుండా అమెరికా మీద ఆధారపడలా అని ప్రశ్నించారు. దేశ ప్రయోజనాలను కాపాడగలిగేది కమ్యూనిస్టులు, లౌకికశక్తులు మాత్రమేనని తెలిపారు.
ప్రపంచ దేశాలపై అమెరికా సుంకాల దాడి..
ప్రపంచ దేశాలపై అమెరికా వాణిజ్యపరమైన దాడి చేస్తోందని రాఘవులు అన్నారు. తమ దేశంలోకి వచ్చే వస్తువులపై 140శాతం దిగుమతి సుంకం విధిస్తామని అమెరికా ప్రకటిస్తోందన్నారు. అమెరికా నుంచి ఇతర దేశాలు దిగుమతి చేసుకునే వస్తువులపై మాత్రం పన్నులు తీసివేయాలని ట్రంప్‌ ఆంక్షలు విధిస్తున్నారని తెలిపారు. మనదేశాన్ని మోడీ అమెరికా కోసం పాలిస్తున్నాడా.. లేక దేశంలోని రైతాంగం కోసం పాలిస్తున్నట్టా అని ప్రశ్నించారు. అమెరికా, ఇంగ్లాండ్‌ వంటి దేశాలతో ఒప్పందాలు చేసుకొని భారతదేశ రైతాంగాన్ని దివాలా తీయించే చర్యలను ఒప్పుకోబోమని ప్రజలు పోరాటాలు నిర్వహించాల్సిన సమయం ఆస న్నమైందన్నారు. కేంద్రం ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్స్‌ ఆర్గనైజేషన్స్‌ అనే సంస్థలను ముందుకు తీసుకొస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో ఇటువంటి సంస్థలను 311 ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఖమ్మం జిల్లాలో నాలుగుచోట్ల ఏర్పాటు చేయబోతున్నారన్నారు. ఇవి మోనోశాంటో, ఐటీసీ వంటి బహుళజాతి కంపెనీలు ఏవైతో ఉన్నాయో వాటి ఆధీనంలోకి వెళ్తాయని, విత్తనాలు, ఎరువులు, సరఫరా, అమ్మకం ఇలా అన్నీ ఆ సంస్థల చేతుల్లోకి వెళ్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులంతా ఈ సంస్థల చేతిలో కాంట్రాక్టు వర్కర్లుగా మారిపోతారని హెచ్చరించారు. ఈ విధానం అమల్లోకి వస్తే ధనిక రైతులు తప్ప చిన్న, సన్నకారు రైతులు ఉండరని తెలిపారు. ఇలాంటి అనేక సమస్యలు ముందున్నాయని, వీటిని ధిక్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు. 8 నుంచి 14 గంటల పని విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈనెల 20న కార్మికులు సమ్మెకు దిగుతున్నారన్నారు. దీనికి కర్షక సంఘాలు సైతం మద్దతు తెలుపుతున్నాయన్నారు. రాబోయే కాలంలో మరిన్ని కష్టాలు వస్తాయని హెచ్చరించారు. వీటిని ఎదుర్కోవాలంటే పోరాట పటిమ అవసరమని అన్నారు. సంక్రాంతి మధుసూదన్‌రావు వంటి వారి స్ఫూర్తితో ఈ పోరాట పటిమ పుణికిపుచ్చుకోవాలన్నారు. ఇండియా కూటమి ఐక్యతను మరింతగా బలపరుచుకోవాలన్నారు.
కాంగ్రెస్‌ ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. ప్రజలు వారి సమస్యలను వారే పరిష్కరించు కునేలా.. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేలా చెప్పగలిగిన గొప్ప నాయకులు మధుసూదన్‌రావు అని అన్నారు. కమ్యూనిస్టు పార్టీలు సమస్యలపై ప్రజలను మేల్కొలిపే కోడికూత లాంటివని తెలిపారు.
కమ్యూనిస్టులే దేశానికి భవిష్యత్తు : తమ్మినేని
లీ షావ్‌ చీ చెప్పినట్టు మంచి కమ్యూనిస్టు లక్షణాలను పుణికిపుచ్చుకున్న వ్యక్తి కామ్రేడ్‌ సంక్రాంతి మధుసూదన్‌రావు అని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. కమ్యూనిస్టు జీవితం చాలా క్లిష్టమని, డబ్బుపై వ్యామోహం, పదవీ కాంక్ష, ప్రాణాలపై తీపి ఉండకూడదని తెలిపారు. అంతటి క్లిష్టమైన జీవితాన్ని మధుసూదన్‌రావు ఎంతో ఇష్టంగా కొనసాగించారని చెప్పుకొచ్చారు. ఉద్యమమే జీవితం.. జీవితమే ఉద్యమంలా జీవించారన్నారు. రజబ్‌అలీ పార్టీని వీడిన సమయంలో వైరా, కొణిజర్ల ప్రాంతంలో పార్టీ చిన్నాభిన్నం కాకుండా మధుసూదన్‌రావు, పెదగోపతికి చెందిన గోపాల్‌రెడ్డి రక్షించగలిగారన్నారు. కమ్యూనిస్టులు లేకపోతే దేశానికి భవిష్యత్‌ లేదన్నారు. బీఆర్‌ఎస్‌ తప్పుడు పనులు చేసి స్వయంకృతాపరాధంతో ఓడిందన్నారు. ఆర్థికలోటు ఉన్నా ప్రాధాన్యతల వారీగా ప్రభుత్వం పనులు చేయాలన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు నిలుపు కోవాలని, మిగిలిన రైతులకు రుణమాఫీ చేయాలని కోరారు. కమ్యూనిస్టులు బలోపేతం కావాలని, మోడీకి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అంతకుముందు లాలాపురంలో ఎర్రజెండాలతో భారీ ప్రదర్శన తీశారు. ఈ సంస్మరణ సభలో డీసీసీ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, ఏజే రమేశ్‌, అన్నవరపు కనకయ్య, బుగ్గవీటి సరళ, కళ్యాణం వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు, సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యర్రా బాబు, జేవీవీ రాష్ట్ర నాయకులు మల్లెంపాటి వీరభద్రం, అలవాల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బాణోత్‌ మదన్‌లాల్‌, సీనియర్‌ నాయకులు మన్నెపల్లి సుబ్బారావు, కొప్పుల కృష్ణయ్య, తాతా భాస్కర్‌రావు, రాయల వెంకటేశ్వర్లు, జిల్లా కమిటీ సభ్యులు తాళ్లపల్లి కృష్ణ, తెలంగాణ శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మెన్‌ మల్లెంపాటి శ్రీధర్‌, డైరెక్టర్‌ శ్రీవిద్య, టీజీవోస్‌ రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు గుంటుపల్లి శ్రీను, కోశాధికారి వేలాద్రి, టీఎస్‌ యూటీఎఫ్‌ ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు షేక్‌ రంజాన్‌, పారుపల్లి నాగేశ్వరరావు, సంక్రాంతి మధుసూదన్‌రావు కుటుంబ సభ్యులు భార్య సామ్రాజ్యం, కుమారులు రవికుమార్‌, కోడలు రాధాకృష్ణ, కుమార్తె నామ సంధ్య, అల్లుడు వెంకటేశ్వరరావు, బంధుమిత్రులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -