Wednesday, August 6, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలున్యాయ వ్యవస్థనే అవమానిస్తారా ?

న్యాయ వ్యవస్థనే అవమానిస్తారా ?

- Advertisement -

– నాలుగు కోట్ల ప్రజలకు క్షమాపణలు చెప్పండి
– మోసగాళ్లకు మాట్లాడే నైతిక హక్కులేదు : హరీశ్‌రావు మాటలపై మంత్రి ఉత్తమ్‌ ఆగ్రహం
– వాస్తవాలను ఒప్పుకోవాలని హితవు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

”ప్రజాస్వామ్య వ్యవస్థలపై బీఆర్‌ఎస్‌కు చులకనభావం. చట్టసభలు, న్యాయ స్థానాలంటే గౌరవం లేదు. న్యాయ వ్యవస్థపై నమ్మకమూ లేదు. సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జి సారధ్యంలో నియమించిన జ్యుడీషియల్‌ కమిషన్‌ అంటే కూడా లెక్కలేదు. ప్రజలు గత ఎన్నికల్లో బుద్ధి చెప్పినా ఇప్పటికీ వాళ్లలో మార్పు రాలేదు. తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పుకోవాలనే సోయి కూడా లేకపోయింది. పార్లమెంట్‌ చట్టం ద్వారా ఏర్పడిన ఎన్డీఎస్‌ఏ మీద నమ్మకం లేదు. మేడిగడ్డను కుంగబెట్టిన దుర్మార్గులు ఇప్పడు ఏకంగా సీనియర్‌ జస్టిస్‌ పీసీ ఘోష్‌ నివేదికనూ అవమానిస్తున్నారా..?” అంటూ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట గత ప్రభుత్వం ఎన్ని అవకతవకలకు పాల్పడింది. ఎన్ని అక్రమాలకు పాల్పడిందో జ్యుడీషియల్‌ కమిషన్‌ విచారణలో బయటపడింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆనాటి ఇరిగేషన్‌ మంత్రి హరీశ్‌రావు బండారం బట్టబయలైంది. అందుకే తేలు కుట్టిన దొంగలా.. హరీశ్‌రావు మళ్లీ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని విమర్శించారు. జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికలోని అంశాలను మాత్రమే ప్రభుత్వం వెల్లడించిందని గుర్తు చేశారు.

అది రేవంత్‌ రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి రాసిన రిపోర్టు కాదనే విషయాన్ని హరీశ్‌రావు మరిచిపోయి నట్టున్నారని అభిప్రాయపడ్డారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు బదులు కాళేశ్వరం ప్రాజెక్టు ఆలోచన మొదలైనప్పటి నుంచి డిజైన్లు, నిర్మాణంలో లోపాలు, మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు వరకు జరిగిన అవకతవకలన్నింటీపై కమిషన్‌ సమగ్రంగా విచారణ జరిపిందన్నారు. ఎవరెవరు తప్పులు చేశారో, అందుకు బాధ్యులెవరనే వివరాలను కూడా ఈ నివేదికలో వెల్లడించిందని చెప్పారు. మేమేం తప్పు చేయలేదనీ, మీ పార్టీ ఆఫీసులో తప్పులు మాట్లాడి తెలంగాణ ప్రజలను ఇంకెన్ని సార్లు మోసం చేస్తారని ప్రశ్నించారు. అప్పటి సీఎం కేసీఆర్‌, ఆనాడు మంత్రిగా ఉన్న హరీశ్‌రావును కూడా పీసీ ఘోష్‌ కమిషన్‌ విచారించిందని వివరించారు. వారిద్దరు స్వయంగా జ్యుడీషియల్‌ కమిషన్‌ ఎదుట హాజరయ్యారని తెలిపారు. ఇప్పుడు పార్టీ ఆఫీసులో పెడబొబ్బలు పెడుతున్న హరీశ్‌రావు, ఆరోజు కమిషన్‌ ముందు ఎందుకు ఈ వివరాలు చెప్పుకోలేదని అడిగారు. హరీశ్‌ అబద్ధపు సాక్ష్యాలు, బుకాయింపులన్నీ.. న్యాయవ్యవస్థ ముందు అబద్ధాలుగా తేలిపోయా యని అన్నారు. ఆయన చేసిన తప్పులన్నీ బయటపడ్డాయని చెప్పారు. ఇప్పుడు ఈ నివేదికపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే భయం వాళ్లను వెంటాడుతున్నదన్నారు. అందుకే..

పార్టీ ఆఫీసుకు వచ్చి ఏకంగా జ్యుడీషియల్‌ కమిషన్‌ను తప్పుబట్టే దుర్మార్గానికి ఒడిగట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయబద్ధ కమిషన్‌కు అపార్థాలు అంటగట్టే నీచానికి దిగజారటం కూడా మీకే చెల్లిందని చెప్పారు. ఇంకా ఎన్నిరోజులు ఇలా తెలంగాణ ప్రజల కండ్లుగప్పి, మభ్యపెడతారని వివరించారు. విచారణ కమిషన్‌ తేల్చిన విషయాలపైనా, ఇచ్చిన నివేదికపైన అసెంబ్లీలో చర్చిస్తామని ప్రజా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు, న్యాయ వ్యవస్థలు, చట్ట సభలపై మా ప్రభుత్వానికి గౌరవముందని తెలిపారు. అందుకే అసెంబ్లీలో ఈ నివేదికను చర్చించేందుకు సిద్ధంగా ఉందనీ, కాళేశ్వరంలో దోషులుగా తేలిన బాధ్యులు, అసెంబ్లీకి వచ్చి చర్చల్లో పాల్గొనాలని కూడా ప్రభుత్వం ఆహ్వానించిందన్నారు. ఫామ్‌హౌజ్‌లో మామ డైరెక్షన్‌, పార్టీ ఆఫీస్‌లో అల్లుడి యాక్టింగ్‌ ఇకనైనా ఆపాలని అన్నారు. అసెంబ్లీకి వచ్చి చేసిన తప్పులు ఒప్పుకొని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పుకోవాలనీ, మీరు వేలకోట్ల అవినీతి చేస్తే ఒప్పు, మేం విచారణ చేసి నిజాలు నిగ్గుతేలిస్తే అది రాజకీయ కక్ష సాధింపా ? అని ప్రశ్నించారు. కమీషన్ల కక్కుర్తితో ప్రజలను, రైతులను పదేండ్లపాటు మోసం చేశారనీ, ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుకు హైడ్రాలజీ అనుమతు లు ఇస్తే దాచిపెట్టారని అన్నారు. నిపుణుల కమిటీ మేడిగడ్డ వద్ద బ్యారేజీల నిర్మాణం వద్దని చెబితే తొక్కిపెట్టి, బ్యారేజీలు ఎక్కడ కట్టాలో మీరే నిర్ణయించుకున్నారా అని ప్రశ్నించారు. కుంగిపోయే ప్రాజెక్ట్‌ కట్టినందుకు సిగ్గుపడాల్సింది పోయి, హరీశ్‌రావు కొత్త నాటకమాడుతున్నారన్నా రు. అది తమ గొప్పతనం అని జనం చెవిలో పువ్వులు పెట్టే ప్రయత్నం చేశారని వివరించారు. నారాయణ పేట-కొడంగల్‌ ప్రాజెక్ట్‌కు ఉమ్మడి రాష్ట్రంలోనే జీవో ఇచ్చారన్నారు. మా ప్రభుత్వం ఒక్క రూపాయి బిల్లు కూడా ఇప్పటి వరకు ఆ ప్రాజెక్ట్‌కు ఇవ్వలేదనీ, ఇక్కడే కాదు ఎక్కడైనా పను లు జరగకుండా ఒక్క రూపాయి బిల్లు ఇవ్వకూడదని మా ముఖ్యమంత్రి స్పష్టమైన అదేశాలు జారీ చేశారన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -