- నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటన
నవతెలంగాణ-హైదరాబాద్: నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ఆస్పత్రులకు చెల్లించాల్సిన బకాయిల విషయంలో గత ఆగస్టు నుంచి ప్రభుత్వ స్పందన కోసం ఎదురు చూసినా ప్రయోజనం లేకపోవడంతో సేవలు నిలిపి వేయడం మినహా మరో గత్యంతరం లేకుండా పోయిందని అసోసియేషన్ అధ్యక్షుడు వద్దిరాజు రాకేశ్ ఒక వీడియో ప్రకటనలో పేర్కొన్నారు. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్కుమార్ విజ్ఞప్తి చేసినా.. సేవల నిలిపివేతకే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది.
ఆర్థిక సమస్యలతో పాటు ఆసుపత్రుల్లో సేవలకు సంబంధించి కూడా చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని మంత్రి, ఆరోగ్యశ్రీ సీఈవోలకు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ పరిధిలో 470 వరకు ఆసుపత్రులు ఉండగా వీటికి సంబంధించి రూ.1,400 కోట్ల బకాయిలు ఉన్నట్లు అసోసియేషన్ చెబుతోంది.
తెల్లరేషన్కార్డు ఇవ్వగానే ఆస్పత్రుల్లో చేర్చుకునే ఆస్పత్రుల్లో సేవలు నిలిచిపోవడంతో పేదలు ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది.బిల్లుల బకాయిలను రాబట్టుకోవడం కోసం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల నిర్వాహకులు సేవలను బంద్ చేయడం ఈ ఏడాదిలో ఇది రెండో సారి. 2024 డిసెంబర్ నాటికి బకాయిలు రూ.1,000 కోట్లు దాటాయని పేర్కొంటూ జనవరి 10 నుంచి ఐదారు రోజులపాటు ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపి వేశారు.